ఎస్‌జీటీలకు షాక్.. బీఈడీ వారికి 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి.. ఈ నెల 25 లోపు ఎన్‌ఐఓఎస్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సిందే

విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఈడీ డిగ్రీతో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)గా నియమితులైన అందరూ ఆరు నెలల బ్రిడ్జి కోర్సును తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


ఈ కోర్సు పూర్తి కాకపోతే ఉద్యోగంపైనే ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
2018 నుంచి 2023 మధ్య కాలంలో ఎస్‌జీటీ పోస్టుల్లో చేరిన బీఈడీ అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. వీరంతా ఈ నెల (డిసెంబర్) 25వ తేదీలోపు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అవకాశం ఇవ్వబోమని విద్యాశాఖ ఇప్పటికే హెచ్చరించింది.
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులే అర్హులని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో బీఈడీ ఉత్తీర్ణులై ఎస్‌జీటీలుగా ఎంపికైన వారు ఈ బ్రిడ్జి కోర్సు ద్వారా డీఈడీ స్థాయి అర్హత సాధించినట్లు పరిగణించబడతారు.
ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా తమ ఉద్యోగ భద్రతను కాపాడుకోవచ్చని టీచర్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు వేలాది మంది బీఈడీ టీచర్లు ఈ ప్రక్రియలో భాగమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆదేశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.