కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఆరేళ్ల క్రితం ఈ మహమ్మారి చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. మళ్లీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి.
మన దేశంలో కూడా రోజు రోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1000కి పైగా కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. ఇటీవల మహేష్ బాబు మరదలు, ప్రముఖ బాలవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే మరో బాలీవుడ్ ప్రముఖ నటి నికితా దత్తాకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు ఆమె తల్లికి వైరస్ సోకింది. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ స్మిత తల్లి కూడా ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో కరోనా కొత్త వేరియంట్ లక్షణాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.
‘ముచ్చటగా మూడు వ్యాక్సిన్లు తీసుకున్నా మూడవ సారి కోవిడ్ నన్ను పలకరించింది. గత కొన్ని రోజులుగా కోవిడ్ కొత్త వేరియంట్ నుంచి కోలుకుంటున్నాను. ఈ కోవిడ్ వేరియంట్ లక్షణాల గురించి అడిగిన వారికోసం .. ఒక రోజు జ్వరంతో నిద్రలేచాను, రెండవ రోజు తలనొప్పి, మూడవ రోజు గొంతు నొప్పి, నాల్గవ రోజు జలుబు, ఐదవ రోజు కడుపు నొప్పి… ఇలా రోజుకొక కొత్త లక్షణం తో ఈ వేరియంట్ “సకల కళా వల్లభన్” లా ఉంది. ఏ వేరియంట్ అయినా వెళ్ళూ వెళ్తూ విపరీతమైన బలహీనతను వదిలి వెళుతుంది, దాని నుండి బయట పడాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే మాస్కులు బయటకు తీయండి, సురక్షితంగా ఉండండి. కేసుల్లేవు అనేది భ్రమ, ఎవరు టెస్ట్ చేయించుకోవడం లేదు అనేది వాస్తవం.
‘వ్యాక్సీన్ సామర్థ్యాన్ని అస్సలు తీసెయ్య లేము. వ్యాక్సిన్ శరీరం లో ఉంది కాబట్టి కోవిడ్ ఊపిరితిత్తుల దాకా వెళ్ళడం లేదు, వెళ్తే ఏం జరిగిందో గతం లో అందరూ చూసిందే’ అని వరుసగా ట్వీట్లు చేశారు జోగుళాంబ. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి. కరోనా నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
































