ఏపీ మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి.. రూ.16,482 కోట్లతో, 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణం వేగవంతం చేశారు. ఏపీ మీదుగా పొరుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్త రహదారుల నిర్మాణం కూడా జరుగుతోంది.


ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలిపే ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్ హైవే నిర్మాణం మరింత వేగవంతం అయ్యింది. రూ.16,482 కోట్లతో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ఆరు వరుసల రహదారిని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఈ ప్రాజెక్టులో భాగంగా, విజయనగరం జిల్లాలోని ఎల్‌.కోట వద్ద ఒక ప్రత్యేకమైన నిర్మాణం చేపట్టారు. అక్కడ ఒక చెరువు చుట్టూ వృత్తాకారంలో రహదారిని నిర్మించడం విశేషం.

ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే కారిడార్‌ను రాయపూర్‌ నుంచి విశాఖపట్నం వరకు నిర్మిస్తున్నారు. ఇది మూడు రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్. ఈ కారిడార్‌లోని ఒక ముఖ్యమైన భాగం ఒడిశాలోని ఉమ్మరికోట వద్ద నిర్మించిన ఇంటర్‌ఛేంజ్. ఇది అనేక రహదారులను అనుసంధానం చేస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో సూచికలు, వివరాల బోర్డుల ఏర్పాటు పూర్తయింది. ఈ కారిడార్‌ కొండలు, అడవుల మధ్యలో ఎన్నో వంపులతో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాలోకి ప్రవేశించగానే, కొండల మధ్యలో రెండు సొరంగాలు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్కో సొరంగం 3.4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సొరంగాల నిర్మాణం ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. వీటిని కొరాపుట్ జిల్లాలోని సుంకి ఘాట్‌కు సమీపంలో నిర్మించారు. ఈ సొరంగాలు కారిడార్‌లోని ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.

ప్రస్తుతం రాయపూర్‌ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఎన్‌హెచ్‌-26 మార్గంలో 597 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. అయితే కొత్తగా నిర్మిస్తున్న ఈ కారిడార్‌తో ఈ దూరం 464 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. అంటే దాదాపు 133 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ కొత్త మార్గం వల్ల ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని పారిశ్రామిక ప్రాంతాలు విశాఖపట్నం పోర్టుతో పాటు, చెన్నె-కోల్‌కతా జాతీయ రహదారికి నేరుగా అనుసంధానం అవుతాయి. ఇప్పటివరకు కొండల గుండా సాగే మార్గంలో రాయపూర్‌ నుంచి విశాఖ చేరుకోవడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఈ కొత్త కారిడార్‌ అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం సగానికి తగ్గి, కేవలం ఆరు గంటల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీనితో పాటు, సరకు రవాణా కూడా చాలా వేగంగా జరుగుతుంది. వ్యాపారాలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నంచి రాయపూర్ త్వరగా వెళ్లొచ్చు.. ఎంతో ఉపయోగంగా కూడా ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.