మహిళా పొదుపు సంఘాల చేత సోలార్విద్యుత్ ఉత్పత్తి చేయించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8 నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కో అధికారులు పనిచేస్తున్నారు.
ఒకటి రెండు రోజుల్లో మహిళా సంఘాలకు సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తూ వర్క్ ఆర్డర్లను ఇవ్వనున్నారు. మహిళా సంఘాల చేత ప్రతి జిల్లాకు రెండు మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టించాలని భావిస్తున్న ప్రభుత్వం నేడో రేపో మహిళలకు వర్క్ ఆర్డర్లు కూడా ఇప్పించనుంది. ఒక్కో మెగావాట్కు రూ.3 కోట్ల చొప్పున అంచనా వ్యయం చేశారు. ఎస్హెచ్జీలకు పెట్టుబడి వ్యయం ఇవ్వడానికి బ్యాంకులు నారా రకాలుగా తిరకాసులు పెడుతుండటంతో స్త్రీనిధి రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఒక్కో మెగావాట్కు రూ.3కోట్ల చొప్పున 32 జిల్లాల్లో 64 మెగావాట్లకు రూ.192 కోట్ల వ్యయం కానుంది. ఇందులో 10 శాతం ఎస్హెచ్జీ భరించాల్సి ఉంటుంది.
మిగిలిన మొత్తాన్ని స్త్రీనిధి రుణంగా చెల్లిస్తుంది. స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాలను ఇప్పటికే ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్లాంట్ల ద్వారా మరింతగా బాసటగా నిలిచేలా చూస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో రెండు మెగా వాట్ల ఉత్పత్తికి ప్రణాళికలను సిద్ధం చేశారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ఉత్పత్తికి ఆలస్యం లేకుండా అటు పంచాయతీరాజ్గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు సాగుతోంది. ఇప్పటికే గ్రామాల్లో విలేజ్ఆర్గనైజేషన్ల ను గుర్తించిన సెర్ప్, డిస్ట్రిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (డీఆర్ డీఏ ) లు, బ్యాంకర్లతో ఒప్పందాలు, విధివిధానాలు పూర్తి చేయించేలా చూస్తోంది. ఈ రకంగా వారికి వచ్చే రుణాలతో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి మహిళ సంఘాల ద్వారా సోలార్పవర్ అందించే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. బ్యాంకర్ల ద్వారా లోన్లు ఇప్పించి పలు దఫాల్లో కనీసం వేయి మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ముందుకు సాగనుంది.