రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సులు.. చార్జీలలో మార్పులు

సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధాలకు ప్రతికైనా రాఖీ పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రయాణికులకు రవాణాపరమైన అసౌకర్యం కలుగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఏర్పాట్లు చేసింది.


ప్రతి ఏడాది మాదిరిగానే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం రాఖీ పండుగకు నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే టికెట్ ధరలను సవరించింది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. ఈ నెల 11వ తేదీ వరకు నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఈ సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేసింది.

ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ.. రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

ఈ జీవో ప్రకారం స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను రాఖీ పండుగ సందర్బంగా సంస్థ సవరించింది. రాఖీ పౌర్ణమికి ప్రైవేట్‌ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచిస్తోంది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సొంతూళ్లకు వెళ్లే వారు తమ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతూ.. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.