వీధికుక్కల సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం (నవంబర్ 7, 2025) మూడు ఆదేశాలు జారీ చేసింది. అమికస్ క్యూరీ నివేదికపై చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అఫిడవిట్ సమర్పించాలని అన్ని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
మరో ఉత్తర్వులో, వీధికుక్కల విషయంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. వీధికుక్కలను రహదారులు, రోడ్ల వెంబడి నుండి తొలగించి షెల్టర్లలో ఉంచాలని సూచించింది. మున్సిపల్ కార్పొరేషన్లు ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేసి, వీధి కుక్కలపై 24 గంటల నిఘా నిర్వహించాలని పేర్కొంది. అంతేకాకుండా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
ముఖ్యంగా విద్యాసంస్థలు, క్రీడా సముదాయాలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా కంచెలు ఏర్పాటు చేయడంతోపాటు ఇతర చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తన మూడవ ఉత్తర్వులో ఆదేశించింది. వీధి కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజేషన్ తర్వాత వాటిని షెల్టర్లలో ఉంచాలని కోర్టు తెలిపింది. తన ఆదేశాలను ఎనిమిది వారాల్లోగా అమలు చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఈ ఏడాది ఆగస్టు 11న, జస్టిస్ జె.బి. పార్దివాలా, ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం కుక్క కాటులను సీరియస్గా తీసుకుంది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ లలో ఉన్న అన్ని వీధి కుక్కలను షెల్టర్ హోమ్ లకే పరిమితం చేయాలని ఆదేశించింది. జంతు ప్రేమికులు ఈ చర్యను నిరసిస్తూ ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేశారు.
ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన మునుపటి ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఢిల్లీ-ఎన్సిఆర్లో వీధి కుక్కలను పట్టుకోవడం, క్రిమిరహితం చేయడం, టీకాలు వేయడం, వాటిని తిరిగి వాటి ఆవాసాలలోకి విడుదల చేయాలని ఆదేశించింది. ఆగస్టు 22న, కోర్టు విచారణల పరిధిని విస్తరించింది. వివిధ హైకోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులను తనకే బదిలీ చేసింది. రాష్ట్రాలను అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరింది. అయితే, రెండు రాష్ట్రాలు మాత్రమే రెండు నెలల్లో అఫిడవిట్లు దాఖలు చేశాయి. అయితే తమ నోటీసుకు ప్రతిస్పందనగా రెండు రాష్ట్రాలు తప్ప మరెవరూ అఫిడవిట్లు దాఖలు చేయకపోవడం పట్ల న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మాత్రమే ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.
అక్టోబర్ 27న జరిగిన విచారణ సందర్భంగా, దేశవ్యాప్తంగా కుక్కలకు సంబంధించిన సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట దిగజారుతోంది. అటువంటి పరిస్థితిలో, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తప్పు. రాష్ట్రాలు తమ ప్రతిస్పందనలను దాఖలు చేయడంలో విఫలమైనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కోర్టు, “రాష్ట్ర అధికారులు వార్తాపత్రికలు చదవరా లేదా సోషల్ మీడియాను ఉపయోగించరా?” అని ప్రశ్నించింది. ఆర్డర్ కాపీ వారి డెస్క్లకు చేరకపోయినా, వారికి ఈ ముఖ్యమైన విషయం గురించి తెలిసి ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది.



































