మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. ఈవీ వాహనాలపై సబ్సిడీ పథకం గడువు పెంపు

www.mannamweb.com


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆదరిస్తున్నారు.

ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణ ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో ఈవీ వాహనాలు ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అయితే భారత ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్) 2024 పొడిగింపును ప్రకటించింది.గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ స్కీమ్‌ను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి జూలై 31న ముగియనున్న ఈ పథకం ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.ఈ నేపథ్యంలో ఈఎంపీఎస్ గురించి వివరాలను తెలుసుకుందాం.

ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈఎంపీఎస్ 2024కి మొదట రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్ ఇప్పుడు రూ.778 కోట్లకు పెరిగింది. ఈ పథకం 5,60,789 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మద్దతు ఇచ్చేలా అందుబాటులో ఉంచారు.అయితే ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు వంటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను కూడా ప్రస్తుతం ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. అందువల్ల బడ్జెట్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

అధునాతన సాంకేతికతలను ప్రోత్సహించడానికి అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీ వాహనాలకు మాత్రమే ప్రస్తుతం ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. ఈ పథకం పరిమిత ఫండ్‌తో ఉంటుంది. ఈఎంపీఎస్ 2024లో కేటాయించిన సబ్సిడీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంపై రూ. 5,000గా ఉంటే, 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం పై రూ. 10,000 సబ్సిడీని అందిస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గరిష్ట సబ్సిడీ కూడా రూ.10,000కే పరిమితం చేశారు. 2024 బడ్జెట్‌లో భారతీయ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్ వెహికల్ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక చర్యలు తీసుకున్నారని మార్కెట్ నిపుణులు వివరిస్తున్నారు.