5 నియమాలు రోజువారీ అలవాట్లతో షుగర్ సహజంగా అదుపులోకి..

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రజలు పోరాడుతున్నది డయాబెటిస్ వ్యాధితోనే. ఇందులో టైప్-1, టైప్-2 అని రెండు రకాలు. భారతదేశంలో అయితే టైప్-2 డయాబెటిస్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యకర జీవనశైలి, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, వంశపారంపర్యంగా టైప్-2 మధుమేహం వస్తుంది. ఒకసారి షుగర్ వ్యాధి బారిన పడిన తర్వాత ఇది జీవితాంతం మీతోనే ఉంటుంది. దీనిని నియంత్రించడం తప్ప మీ చేతుల్లో ఏమీ ఉండదు.మధుమేహాన్ని అదుపు చేయకపోతే మరింత ముదిరి గుండె,మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్ళు ఇలా శరీరంలో ప్రతి ప్రధాన అవయవం దెబ్బతింటుంది. అందుకే శరీరంలో చక్కెర శాతం పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. కింద ఇచ్చిన 5 నియమాలు ప్రతి రోజూ అనుసరిస్తే షుగర్ లెవల్స్ నియంత్రించి దాని వల్ల వచ్చే ప్రమాదాలను ఆపవచ్చు.


1. మెంతి గింజల నీరు :

మెంతిగింజలకు మధుమేహాన్ని నియత్రించే శక్తి ఉంది. ఈ విత్తనాల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మెంతులను ప్రతిరోజూ రాత్రి నీళ్లలో నానబెట్టుకుని ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ అలవాటు షుగర్ లెవల్స్ అదుపు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

2. ఉల్లిపాయ సలాడ్ :

పచ్చి ఉల్లిపాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. 100 గ్రాముల పచ్చి ఉల్లిపాయను తింటే చాలు. నాలుగు గంటల్లోనే రక్తంలో చక్కెర తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సలాడ్ లేదా గార్నిష్‌గా మీ రోజువారీ భోజనంలో ఉల్లిపాయలను చేర్చుకుంటే డయాబెటిస్ సులువుగా అదుపు చేయవచ్చు.

3. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ :

వంట నూనె కూడా మధుమేహాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శుద్ధి చేసిన నూనెల్లో తరచుగా ట్రాన్స్ ఫ్యాట్స్, అసమతుల్య ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇవి వాపు, ఇన్సులిన్ నిరోధకతను మరింత తీవ్రతరం చేస్తాయి. బదులుగా ఆవ నూనె, కొబ్బరి నూనె లేదా ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వంటి కోల్డ్ ప్రెస్డ్ నూనెలను వాడండి. ఈ నూనెల సమతుల్య ఫ్యాటీ యాసిడ్లు, సహజ నిరోధక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయి తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.అందుకే షుగర్ ఉన్నవారు ఈ నూనెలు వాడటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

4. నడక :

భోజనం తర్వాత క్రమం తప్పకుండా 500 అడుగులు నడిస్తే మంచిది. ఈ తేలికపాటి శారీరక శ్రమ మీ కండరాల పనితీరు మెరుగుపరుస్తుంది. రక్తప్రవాహం పెరిగి శరీరంలోని గ్లూకోజ్‌ కరుగుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు నియంత్రణలోకి వస్తాయి. జీర్ణక్రియ సరిగా ఉండేందుకు, బరువు అదుపులో ఉండేందుకు ఈ అలవాటు ఎంతో మంచిది.

5. ఉసిరి, పసుపు నీళ్లు :

మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట ఉసిరి నీటిలో పసుపు వేసుకుని తాగితే ఎన్నో లాభాలు. ఎందుకంటే, ఉసిరిలో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇక పసుపుకు రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలున్న కర్కుమిన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఈజీగా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఒక టీస్పూన్ ఉసిరి రసం, చిటికెడు పసుపు పొడిని గ్లాసు నీటిలో కలిపి నిద్రపోయే ముందు తాగాలి. ఈ మిశ్రమం మెరుగైన గ్లూకోజ్ జీవక్రియకు సహాయపడటమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ పనితీరు సక్రమంగా జరిగేలా చేస్తుంది.