Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌.. మంజూరు చేసిన సుప్రీంకోర్టు

www.mannamweb.com


 

&nbspMLC Kavitha Bail (దిల్లీ): మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు (Kavitha) సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని.. ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని పేర్కొంది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సిన ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌ అప్పట్లో ప్రకటించారు. అరెస్ట్‌ వారెంట్‌తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి ఐదు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తిహాడ్‌ జైలుకు తరలించారు.

ఇదీ నేపథ్యం
దిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు దిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్‌ లాబీ తరఫున రూ.కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్‌ రామచంద్రపిళ్లై రిమాండ్‌ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్‌ గ్రూప్‌ ద్వారా రూ.100కోట్ల ముడుపులు ఆప్‌కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీస్‌ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్టు చేసింది.