కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. మంగళవారం రోజున

www.mannamweb.com


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించనుంది. ఓవైపు దేశవ్యాప్త నిరసనలు, మరోవైపు హెల్త్ కేర్ సర్వీసుల నిలిపివేత నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ పీజీ ట్రైనీ విద్యార్థిని డ్యూటీలో ఉండగా లైంగిక దాడి, హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వివిధ రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఈ ఘటనలో నిందితులకు తీవ్రమైన శిక్ష విధించాలని, తమకు భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్ చేశారు. అంతకుముందు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్న ఇద్దరు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు.

‘క్రూరత్వంతో మూగబోయిన బాధితులకు ఈ కేసులో న్యాయ వ్యవస్థ ద్వారానే న్యాయం జరుగుతుందని యావత్ దేశం చూస్తోంది. ఇతరులకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేసిన యువ వైద్యురాలి మరణానికి తగిన న్యాయం చేకూర్చాలి. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉంటే మరోవైపు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కాల్ డేటా, చాటింగ్ వివరాలను పరిశీలిస్తోంది. వరుసగా మూడో రోజు ఆదివారం కూడా సందీప్ ఘోష్ ను విచారించింది. ఇప్పటికే ప్రధాన నిందితుడితోపాటు 20 మందిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. సందీప్ ఘోష్ మొబైల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్ల నుంచి కాల్ డేటా, చాట్ వివరాలను సేకరిస్తున్నారు.

కాగా.. వైద్యురాలి హత్యాచార కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. తమకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్ నుంచి కానీ కాలేజీ యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి సహకారం లభించడం లేదని వాపోయారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. స్మశాన వాటికలో తమ కూతురితో పాటు మరా మూడు మృతదేహాలు ఉండగా, తొలుత బాధితురాలి శవానికి అంత్యక్రియలు జరిపారని.. చెప్పుకొచ్చారు.

దీంతో ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న చర్చ తెరపైకి వచ్చింది. కాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయం జరగాలని అంటున్నారని, కానీ.. తన కూతురుకు న్యాయం జరగాలని నినదిస్తున్న వారిని జైల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరి సుప్రీం ఈ కేసును సుమోటోగా స్వీకరించిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.