వంశీ బెయిల్ రద్దుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

మాజీ ఎమ్మైల్యే వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) అక్రమ మైనింగ్ కేసుపై సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ జరిగింది.


వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం (AP Govt) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈరోజు (బుధవారం) ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగగా.. అక్రమ మైనింగ్ చేసి వంశీ రూ. 196 కోట్లు దోపిడీ చేశారని ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 17కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

కాగా.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల్లో వంశీతో పాటు అతని అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడి ఖజానాకు రూ. 196 కోట్లు నష్టం తెచ్చారంటూ కృష్ణా జిల్లా మైనింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మే 14న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ.. ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. మే 29న వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.

సివిల్ కేసులో..

అలాగే సివిల్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం నిరాకరించింది. గన్నవరంలో ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించుకున్న కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుంకర సీతామహాలక్ష్మి సుప్రీంలో సవాలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరుగగా.. 2024లో దాడి జరిగితే 2025లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడమేమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారని కూడా మరో ప్రశ్న సంధించింది సుప్రీం ధర్మాసనం. ఈ క్రమంలో హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.