టీచర్స్ డే.. పిల్లలకు పాఠాలు చెబుతున్న ఆ పెద్ద సారు ఎవరో గుర్తుపట్టారా.

www.mannamweb.com


ఆయన ఓ ఐఏఎస్ అధికారి.. రాష్ట్రంలోని మహా నగరానికి జిల్లా మేజిస్ట్రేట్.. ఓ స్కూలు సందర్శనకు వెళ్లిన ఆయన.. మాస్టారు అవతారమెత్తారు. పిల్లలను చూసి వారితో సరదాగా ముచ్చటించారు. వారి చిలిపి ప్రశ్నలు విని పాఠాలు బోధించ కుండా ఉండలేకపోయారు. ప‌లు అంశాల‌పై కుశ‌లప్రశ్నలు అడిగారు. ప‌దో త‌ర‌గ‌తి బాలురకు ఫిజిక్స్ క్లాస్ చెప్పి.. అమ్మాయిల‌కు సోష‌ల్ క్లాస్ తీసుకున్నారు. ఇక ఆరో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు జాగ్రఫీ క్లాస్ చెప్పి కలెక్టర్ మాస్టారు అనిపించుకున్నారు. ఇంతకీ ఎవరా క‌లెక్టర్ అనేగా..

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా త‌ర్ఫీదు ఇవ్వాలి

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా త‌ర్ఫీదు ఇవ్వాల‌ని, ప్రత్యేక శ్రద్ధ వ‌హిస్తూ వారికి బంగారు భ‌విష్యత్తును అందించాల‌ని విశాఖ జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం అమ‌లు చేస్తున్న క‌రిక్యుల‌మ్‌ను మ‌రింత ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని, వారిలో సాఫ్ట్ స్కిల్స్ పెరిగేలా కృషి చేయాల‌ని విద్యాశాఖ అధికారుల‌కు, ఉపాధ్యాయుల‌కు సూచించారు. భీమిలి ప‌రిథిలోని చిట్టివ‌ల‌స జిల్లా పరిషత్ ఉన్న‌త పాఠ‌శాల‌ను సంద‌ర్శించిన జిల్లా క‌లెక్టర్ అక్కడి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. మ‌ధ్యాహ్న భోజన ప‌థ‌కం, సీబీఎస్ఈ విధానం అమ‌లు, అక్కడ క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. ఈ క్రమంలోనే ప‌ది, ఆరో త‌ర‌గ‌తి విద్యార్థుల‌తో కాసేపు ముచ్చటించారు. వివిధ స‌బ్జెక్టుల‌ను బోధించి, విద్యార్థుల‌ను విభిన్న కోణాల్లో ప్రశ్నించారు.

ప‌దో త‌ర‌గ‌తి బాలుర సెక్షన్‌కు వెళ్లి ఫిజిక్స్ బోధించిన క‌లెక్టర్.. రిపబ్లిక్ అనే అంశంపై పాఠం చెప్పారు. అనంత‌రం సంబంధిత అంశంపై విద్యార్థుల‌ను ప్రశ్నించి స‌మాధానాలు రాబట్టారు. సీబీఎస్ఈ విధానం ఎంత వ‌ర‌కు దోహ‌ద‌ప‌డుతుందో వివరించారు. అనంత‌రం ప‌దో త‌ర‌గతి బాలిక‌ల సెక్షన్‌కు వెళ్లిన ఆయ‌న, అక్కడ విద్యార్థుల‌తో మాట్లాడారు. సోష‌ల్ స‌బ్జెక్టును బోధించి అందులో ప్రశ్నలు సంధించారు. అలాగే అదే పాఠ‌శాల‌లోని ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న చిన్నారుల‌తో మాట్లాడిన క‌లెక్టర్ ప‌లు అంశాల‌పై కుశ‌ల ప్రశ్నలు వేశారు. జాగ్రఫీ స‌బ్జెక్టును బోధించిన ఆయ‌న విభిన్న కోణాల్లో ప్రశ్నలు సంధించి, స‌మాధానాలు రాబ‌ట్టారు. విద్యార్థులు క‌రిక్యుల‌మ్ ను అనుస‌రించటంతోపాటు క్రీడ‌ల‌కు స‌మ‌యం కేటాయించాల‌ని, మానసిక ఉల్లాసం పొందేలా కొన్ని ప్రక్రియ‌లు చేయాల‌ని సూచించారు. అనంత‌రం పాఠ‌శాల ప‌రిస‌రాల్లో క‌లియ తిరిగిన ఆయ‌న ప‌లు త‌ర‌గ‌తి గ‌దుల‌ను, మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌థ‌కంపై ఆరా తీసి, వంటశాల‌ను సంద‌ర్శించారు.

అంగ‌న్వాడీ కేంద్రంలో చిన్నారులతో..

చిట్టివ‌ల‌స‌లోని అంగ‌న్వాడీ కేంద్రాన్ని జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంద్ర ప్రసాద్ సంద‌ర్శించారు. అక్కడున్న చిన్నారుల‌తో ముచ్చటించారు. సేవ‌ల‌ను, స్థానిక ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించారు. పిల్లల సంఖ్య, వారికి క‌ల్పిస్తున్న క‌నీస సౌక‌ర్యాల‌పై నిర్వాహ‌కుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ‌ర్భిణుల‌కు క‌లెక్టర్ చేతుల మీదుగా పోష‌ణ కిట్లను అంద‌జేశారు. నెల‌ల చిన్నారికి ఐసీడీఎస్ అధికారుల‌తో క‌లిసి అన్నప్రాస‌న చేశారు. ప‌ర్యట‌న‌లో భాగంగా అంగ‌న్వాడీ కేంద్రం ద్వారా అందుతున్న సేవ‌ల‌పై ఆరా తీసిన క‌లెక్టర్ రికార్డుల‌ను తనిఖీ చేశారు. అంగాన్వాడీ కేంద్ర నిర్వహణ, స‌కాలంలో గ‌ర్భిణుల‌కు, చిన్నారుల‌కు పౌష్టికాహారం అందించాల‌ని నిర్వాహ‌కుల‌ను ఆదేశించారు.