ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్) 2026 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఉన్నత విద్యా రంగంలో ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు ఇది కీలకమైన అవకాశంగా మారింది. నోటిఫికేషన్ ప్రకారం మార్చి 28, 29 తేదీల్లో ఆన్లైన్ విధానంలో సెట్ 2026 పరీక్షలు జరగనున్నాయి. ఇక ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 9 నుంచి ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 9, 2026వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
అర్హతలు
APSET కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, EWS కేటగిరీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు, SC, ST, BC, PwD, థర్డ్ జెండర్ వర్గాలకు చెందిన అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెట్ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్1, పేపర్2 పరీక్షలు నిర్వహిస్తారు.
ఇందులో పేపర్ 1 జనరల్ స్టడీస్ (టీచింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్) పరీక్ష అందరూ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. మొత్తం 30 సబ్జెక్టుల్లో పేపర్2 పరీక్షలు నిర్వహిస్తారు. సెట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మార్చి 19 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహిస్తోంది.
ఈ ఏడాది కూడా ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఏయూ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో www.apset.net.in లేదా www.andhrauniversity.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9, 2026 వరకు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండానే తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఫిబ్రవరి 25 వరకు రూ. 2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 5 వరకు రూ. 5,000 అధిక ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.


































