ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఇన్ని రోజులు పెండింగ్లో ఉండగా.. ఎట్టకేలకు పైనల్ సెలక్షన్ లిస్ట్ను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన పోర్టల్లో విడుదల చేసింది. మెుత్తం 905 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ సెలక్షన్ లిస్ట్ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. క్రీడా కోటాకు సంబంధించి.. గ్రూప్ 2లో రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులు ఇచ్చిన ఐచ్ఛికాల మేరకు ఎక్సైజ్ ఎస్సై, లా ఏఎస్ఓ పోస్టులు పక్కన ఉన్నాయి.
25 పోస్టుల్లో రిజర్వేషన్ ప్రకారం మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగిలిన 866 పోస్టుల్లో ఎలాంటి మార్పు జరగదు. ప్రకటించని 14 పోస్టులు, క్రీడా కోటా రెండు పోస్టులు, 7 దివ్యాంగ, 5 రిజర్వేషన్ పోస్టులకు సంబంధిత కేటగిరీల్లో అభ్యర్థులు లేరు.
గ్రూప్-2లో 905 పోస్టుల భర్తీకి 2023 డిసెంబరు 7న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ జరిగాయి. 2025 ఫిబ్రవరి 23న మెయిన్ పరీక్షలు రాశాలు. 2025 ఏప్రిల్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి. తర్వాత కోర్టు కేసుల దృష్ట్యా అభ్యర్థుల ఎంపిక జాబితా తయారీకి సమయం పట్టింది.
గ్రూప్ 2 సర్వీసుల కిందకు వచ్చే పోస్టుల కోసం ప్రధాన పరీక్ష నుండి షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష, వైద్య పరీక్షల తర్వాత వారు ఎంచుకున్న పోస్టులు/జోన్లు/జిల్లాల ప్రాధాన్యతల ప్రకారం తాత్కాలికంగా ఎంపిక చేసినట్టుగా కమిషన్ తాజాగా పేర్కొంది. ఈ ఎంపికలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులకు లోబడి ఉంటాయని తెలిపింది.
‘పరీక్షలో విజయం సాధించినంత మాత్రాన నియామకానికి ఎటువంటి హక్కు లభించదు. అభ్యర్థి నడవడిక, గతాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. అవసరమని భావించే విచారణ తర్వాత, నియామక అధికారి ఆ అభ్యర్థి సదరు సేవలో నియామకానికి అన్ని విధాలా అర్హుడని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే నియామకం జరుగుతుంది.’ ఏపీపీఎస్సీ ఎంపిక జాబితాలో వెల్లడించింది.
అభ్యర్థి నిబంధనలు/నోటిఫికేషన్ ప్రకారం నియామక అధికారి కోరిన అసలు ధృవపత్రాలను సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థి ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చారని లేదా అభ్యర్థి ఎంపిక సక్రమంగా జరగలేదని కమిషన్ దృష్టికి వస్తే ఏ దశలోనైనా రద్దు చేసేందుకు అవకాశం ఉంటుంది. చర్యలు తీసుకుంటారు.
మిగిలిపోయిన ఖాళీలకు ఎంపికలు, నోటిఫికేషన్ షరతులు/మెయిన్స్ పరీక్షలో అర్హత గల అభ్యర్థుల ఫలితాల ప్రకారం, ప్రస్తుతం అమలులో ఉన్న నియమాలు, విధానాల ప్రకారం విడిగా కమిషన్ సమీక్షించనుంది.

































