ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి హడావిడి మొదలైంది.. ఈ పండుగ కోసం జనాలు ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలతో పాటుగా మరికొన్ని చోట్ల జరిగే కోడి పందాలు.
అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగ తేదీల్లో వచ్చిన గందరగోళం కోళ్ల పందెం నిర్వాహకులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం పండుగ తేదీలు మారడంతో.. అందుకు తగ్గట్టుగా కోళ్లను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. సాధారణంగా, లీపు సంవత్సరం కాకపోతే సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం లీపు సంవత్సరం కాకపోయినా.. పండితులు మాత్రం లీపు సంవత్సరంలో వచ్చే తేదీలైన జనవరి 14, 15, 16 తేదీల్లో పండుగ జరుపుకోవాలని లెక్కించారు.
ఈ తేదీల మార్పు విషయం ఆలస్యంగా తెలియడంతో.. పండుగ కోసం చాలా ముందుగానే ఏర్పాట్లు చేసుకునే కోళ్ల పందెం నిర్వాహకులు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే.. కోళ్ల పందెంలో కొన్ని రంగులతో ఉన్న కోళ్లు గెలుస్తాయోనని వారి నమ్మకం. జనవరి 13, 14, 15 తేదీలను దృష్టిలో పెట్టుకుని వారు కొన్ని ప్రత్యేక రకాల కోళ్లను పెంచారు. ఇప్పుడు, జనవరి 14, 15, 16 తేదీలకు అనుగుణంగా ఉండే కోళ్లను మార్చుకోవాల్సి వస్తుంది. కొందరు కోళ్ల పందెం నిర్వాహకులు.. తేదీ కంటే ఆ రోజు వచ్చే వారం, తిథి, నక్షత్రం వంటివి కోళ్ల రంగుల ఎంపికలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. మంగళవారం వస్తే ఒక రకమైన రంగుల కోళ్లు.. అదే బుధవారం, గురువారం వస్తే మరో రకమైన రంగుల కోళ్లు బావుంటాయట.
ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 13, 14, 15 తేదీల్లోనే ఉంటుందని ముందుగా అంచనా వేశారు. అంటే ఆ తేదీలు వరుసగా మంగళవారం, బుధవారం, గురువారం వస్తాయని భావించారు. అందుకు తగిన విధంగా కోళ్లను కొనుగోలు చేసి, శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు తేదీలు ఒక రోజు ముందుకు జరగడంతో.. సంక్రాంతిలో చివరి రోజైన కనుమ పండుగ శుక్రవారం వస్తుంది. అయితే కోడి పందాల నిర్వాహకులు ఆ రోజుకు సిద్ధంగా లేరట. చాలా మంది దగ్గర శుక్రవారానికి సరిపోయే రంగుల కోళ్లు లేవట. శుక్రవారానికి అనుకూలమైన కోడి నెమలి, డేగ, పచ్చ కాకి, కోడి పింగల, నెమలి అబ్రసు వంటి కోళ్ల కోసం పందెం రాయుళ్లు ఆరా తీస్తున్నారట.
జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, రాశి, నక్షత్రాలు వంటి అనేక అంశాలపై పందెం కాసేవారికి నమ్మకాలు ఉంటాయని చెబుతున్నారు. కోడి రంగును ఎంచుకోవడానికి రోజులోని నిర్దిష్ట సమయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారంటున్నారు. ఈ తేదీల మార్పు వల్ల, కోళ్ల పందెం నిర్వాహకులు తమ కోళ్లను మార్చుకోవాల్సి వస్తోంది. ఇది వారికి భారంగా మారుతోంది. కొత్త కోళ్లను కొనుగోలు చేయడం, వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే కోళ్ల పందెం వినోదంతో పాటుగా సంప్రదాయం కూడా అంటున్నారు.
కొత్త తేదీల ప్రకారం.. శుక్రవారం రోజున పందెం జరిగితే, దానికి తగ్గట్టుగా కోళ్ల రంగులను ఎంచుకోవడంలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు. కొందరు పాత కోళ్లనే మార్పులకు అనుగుణంగా సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంటే.. మరికొందరు కొత్త కోళ్లను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

































