ఫాస్ట్‌ట్యాగ్‌లకు చరమగీతం.. టోల్ గేట్‌లు ఉండవు.. సరికొత్త విధానం ఇదే

Toll Collection System: భారతదేశంలోని రహదారులపై టోల్‌ ఫీజు వసూలు మరింత అడ్వాన్స్‌డ్‌గా మారనుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ స్థానంలో శాటిలైట్‌ బేస్డ్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ సిస్టమ్‌ను ప్రవేశపెడతామని రోడ్డు, రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.


దేశంలోని టోల్ ప్లాజాల స్థానంలో GPS బేస్డ్ టోల్ సిస్టమ్‌ సహా కొత్త టెక్నాలజీలను ప్రభుత్వం అన్వేషిస్తోందని, త్వరలో కొత్త GPS శాటిలైట్‌ బేస్డ్ టోల్‌ కలెక్షన్‌ ప్రారంభిస్తామని గడ్కరీ తెలిపారు. జీపీఎస్‌ బేస్డ్‌ టోల్‌ కలెక్షన్‌ సిస్టమ్‌ పనితీరు, ప్రయోజనాలు చూద్దాం.

శాటిలైట్ బేస్డ్‌ టోల్ కలెక్షన్ సిస్టమ్ వర్సెస్‌ ఫాస్ట్‌ట్యాగ్‌

ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్యాగ్స్ ఆటోమేటిక్ టోల్ డిడక్షన్‌ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ప్రజలు ఈ రీలోడబుల్‌ ట్యాగ్‌లను వెహికల్ విండ్‌షీల్డ్‌కు అతికిస్తారు. వాటిని బ్యాంక్ అకౌంట్‌ లేదా ప్రీపెయిడ్ వ్యాలెట్‌కి లింక్ చేస్తారు. వాహనాలు టోల్ బూత్‌కు చేరుకున్నప్పుడు, ఫాస్ట్‌ట్యాగ్ స్కానర్‌లు ట్యాగ్‌లను గుర్తించి, ఆటోమేటిక్‌గా టోల్ అమౌంట్‌ను డిడక్ట్‌ చేస్తాయి. దీంతో త్వరగా టోల్‌ వసూలు జరుగుతుంది, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా త్వరగా వాహనాలు ముందుకు కదులుతాయి.

అదే కొత్త శాటిలైట్‌ బేస్డ్‌ టోల్‌ కలెక్షన్‌ సిస్టమ్‌, GPS ద్వారా వాహన కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తుంది. టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్‌ చేస్తుంది, టోల్ రోడ్లపై వాహనం ప్రయాణించే దూరం ఆధారంగా టోల్‌ డిడక్ట్ చేస్తుంది. ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే టోల్‌ ప్లాజాల అవసరం ఉండదు. ఈ విధానంలో GPS-ఎనేబుల్డ్‌ ఫాస్ట్‌ట్యాగ్‌లు యూజ్‌ చేయవచ్చు. అడ్వాన్స్‌డ్ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఇంటిగ్రేట్‌ చేయనున్నారు. దీని బెనిఫిట్స్ చూద్దాం.

టోల్ ప్లాజాల తొలగింపు

కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, వాహనాలు టోల్ బూత్‌ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. రహదారులపై ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది.

ట్రాఫిక్ కష్టాలకు చెక్

టోల్ ప్లాజాల తొలగింపుతో ట్రాఫిక్‌ ఫ్లో సాఫీగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌ అయ్యే అవకాశం ఉండదు.

భద్రత

GPS ట్రాకింగ్ వాహన భద్రతను మెరుగుపరుస్తుంది. దొంగిలించిన వాహనాలను అధికారులు ఈజీగా గుర్తించవచ్చు.

సవాళ్లు

కొత్త సిస్టమ్‌లో వినియోగదారుల సేవింగ్స్‌ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌గా టోల్‌ ఛార్జీ డిడక్ట్‌ అవుతుంది. దీంతో సైబర్ నేరాల రిస్కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే టోల్ ప్లాజాలకు 5 కి.మీ పరిధిలో ఉండే వారికి ఫాస్ట్ ట్యాగ్‌ ఫ్రీ యాక్సెస్‌ అందిస్తుంది. ఇది కూడా ప్రమాదమే. GPS బేస్డ్‌ టోల్‌ కలెక్షన్‌లో దీనికి సంబంధించిన ఛార్జీలు ఇంకా నిర్ణయించలేదు.

విదేశాల్లో GNSS-బేస్డ్‌ టోల్ కలెక్షన్

జర్మనీ, రష్యా, స్లోవేకియా వంటి ఐరోపా దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలు హైవే ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్‌, సామర్థ్యాన్ని పెంచడానికి GPS-బేస్డ్‌ టోల్ కలెక్షన్‌ సిస్టమ్‌ అమలు చేస్తున్నాయి. త్వరలోనే ఇండియాలో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.