Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుకు రంగం సిద్ధం!

www.mannamweb.com


Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుకు రంగం సిద్ధం!

కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గన్నవరంలో తెదేపా కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా. ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైకాపా మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. మొన్నటి వరకు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెదేపా కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్‌ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు.

అయితే.. పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ తెదేపా శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పైగా తెదేపా పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, నాలుగేళ్లుగా పార్టీ శ్రేణుల్ని వేధించడం, నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వంశీ కుటుంబం హైదరాబాద్‌లోనే నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు. గురువారం మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.