కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వేతన పెంపునకు ఒకరోజు ముందే ఉద్యోగ విరమణ చేసే వారికి తమకు పెంపు వర్తించదేమోనన్న ఆందోళన అక్కర్లేదు!
వార్షిక వేతన పెంపు తేదీకి ఒక్కరోజు ముందు రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాల పెంపునకు జనవరి 1, జూలై 1 తేదీలను ప్రతిపాదించారు. ఈ మేరకు డిసెంబరు 31, జూన్ 30 తేదీల్లో ఉద్యోగ విరమణ చేసేవారికి కూడా నోషనల్ హైక్ వర్తించనుంది. ఇదివరకు.. ఇలాంటి వాటిల్లో కోర్టు ఉత్తర్వులు జారీ అయిన కేసుల్లోనే నోషనల్ ఇంక్రిమెంట్ వర్తింపజేసేవారు. తాజాగా కేంద్రమే ప్రకటన చేయడంతో డిసెంబరు 31, జూన్ 30 తేదీల్లో రిటైర్ అయిన ఉద్యోగులకూ ప్రయోజనం కలగనుంది.
































