తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. గత పదేళ్ల రికార్డును బద్దలు కొడుతూ వణికిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని ఏకంగా 28 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి.
ఈ సీజన్లో అత్యంత చలి నమోదైన ప్రాంతంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలం నిలిచింది, ఇక్కడ అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. డిసెంబరు రెండో వారంలో ఈ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. రాజధాని హైదరాబాద్లోనూ చలి వణికిస్తోంది, ఇక్కడ 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.9 డిగ్రీలు తక్కువ.
ఆదిలాబాద్, మెదక్ వంటి నగరాలతో జిల్లా కేంద్రాలలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల వరకు పడిపోయాయి. హనుమకొండలో 8.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వరుసగా పడిపోతున్న ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రాంతాలు, శివారుల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధుల్లో చర్మం పగుళ్లు, కళ్ల నుంచి నీళ్లు రావడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక జిల్లాల్లో ఉదయం పూట దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, రాబోయే శని, ఆది, సోమవారాల్లోనూ చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మూడు రోజుల్లో చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున శనివారం 20 జిల్లాలకు ఆదివారం 13 జిల్లాలకు, సోమవారం 12 జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు వెచ్చని దుస్తులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలని తెలిపారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా.. వెచ్చటి దుస్తులు ధరించాలన్నారు.


































