ఆంధ్రప్రదేశ్కు కేంద్రం తీపికబురు చెప్పింది.. కొత్త రైల్వే లైన్లపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. మచిలీపట్నం-రేపల్లె మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ (వివరాల ప్రాజెక్ట్ నివేదిక) తయారీ కోసం క్షేత్రస్థాయి సర్వే ప్రారంభమైందని తెలిపారు.
లోక్సభలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుంది, 2026-27 బడ్జెట్లో ఈ ప్రాజెక్టును చేరుస్తారా లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం డీపీఆర్ సిద్ధమవుతోందని.. దివిసీమ, అవనిగడ్డ ప్రజల చిరకాల డిమాండ్ అయిన ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ఏపీలో
కీలకమైన ప్రాజెక్ట్ అని.. దీనికి ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. డీపీఆర్ తయారీతో పాటు, మచిలీపట్నం-నర్సాపురం మధ్య 74 కిలోమీటర్లు, రేపల్లె-బాపట్ల మధ్య 46 కిలోమీటర్ల కొత్త లైన్ల నిర్మాణం చేపడతామన్నారు. గూడూరు-విజయవాడ మధ్య 293 కిలోమీటర్ల నాలుగో లైన్, 49 కిలోమీటర్ల పొడవైన విజయవాడ బైపాస్ లైన్ (ఇందుపల్లి-దుగ్గిరాల)ల డీపీఆర్ల తయారీకి అవసరమైన సర్వే చేపట్టడానికి అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
విజయవాడ-తెనాలి మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణం వేగంగా జరుగుతోందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ – గుంటూరు జిల్లా దుగ్గిరాల మధ్య
నిర్మాణం కోసం ప్రస్తుతం సర్వే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం మధ్య అదనపు రైల్వే లైన్ల కోసం (డబ్లింగ్) పనులు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2014కు ముందు రైల్వే బడ్జెట్ కేవలం రూ.886 కోట్లు మాత్రమే ఉండేదని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఏకంగా రూ.9,417 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించామన్నారు.
2009 నుంచి 2014 మధ్యకాలంలో కేవలం 363 కిలోమీటర్ల ట్రాక్లు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చాయన్నారు కేంద్రమంత్రి. అయితే, 2014 నుంచి 2025 మధ్యకాలంలో 1,582 కిలోమీటర్ల ట్రాక్లు ప్రారంభమయ్యాయన్నారు. ‘ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో ప్రస్తుతం 12 కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, 27 లైన్ల డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ కలిపి 4,498 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. వీటి కోసం ప్రభుత్వం రూ.70,231 కోట్లు ఖర్చు చేస్తోంది. రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో (పూర్తిగా లేదా పాక్షికంగా) 15 కొత్త రైల్వే లైన్లు, 49 లైన్ల డబ్లింగ్ పనుల కోసం 64 సర్వేలు చేపట్టారు. ఈ సర్వేలు పూర్తయితే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ పనులన్నీ కలిపి మొత్తం 6,967 కిలోమీటర్ల పొడవు ఉంటాయి’ అని కేంద్రమంత్రి తెలిపారు.




































