ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు

www.mannamweb.com


ఏపీలో భారీ వర్షాలు, వరదలతో పలు జిల్లాల్లోని ప్రజలు అల్లాడుతున్నారు. ఎన్నడూ ఊహించని విధంగా వరద ప్రభావంతో విజయవాడ అతలాకుతలమైపోయింది. ఎందరో నిరాశ్రయులయ్యారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి సోమవారం మధ్యాహ్నం ఒడిశా సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా ఇప్పుడు ఏపీ ప్రజలను మరో భయం పట్టుకుంది. ఎప్పుడూ అలలతో గంభీరంగా ఎగసిపడే సముద్రం ఊహించని విధంగా అందరూ చూస్తుండగానే వెనక్కు వెళ్ళింది. దీంతో ఏం ముప్పు పొంచి ఉందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సముద్రం సందర్శకులు చూస్తుండగానే ఒక్కసారిగా వెనక్కి వెళ్లింది. నిత్యం అలలతో ఎగసిపడే ఉప్పాడ సముద్రం 500మీటర్లు వెనక్కి వెళ్లడంతో సందర్శకులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడంతో ఏదో విపత్తు పొంచి ఉందంటున్నారు మత్స్యకారులు. సుబ్బంపేట, ఎస్ పి జి ఎల్ శివారులో సముద్రం వెనక్కి వెళ్లడంతో అక్కడ మత్స్యకారుల పిల్లలు క్రికెట్ ఆడుకున్నారు. ఒకపక్క తుఫాను,ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు.. సముద్రం నీటిమట్టంలో పెరుగుదల కనిపిస్తుందనుకున్నారు. కానీ విచిత్రంగా సముద్రం వెనక్కి వెళ్లడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో స్థానిక మత్స్యకారులు, ప్రజలు, సందర్శకులు భయాందోళనలకు గురవుతున్నారు.