సంక్రాంతి పండుగ ముగిసినా రైల్వే ప్రయాణికుల రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. సెలవులు పూర్తయిన తర్వాత కూడా స్వగ్రామాల నుంచి నగరాలకు తిరిగి వస్తున్న ప్రయాణికులు, ఉద్యోగాలు, చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా ఉండటంతో రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది.
ఈ నేపథ్యంలో టిక్కెట్లు దొరకక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 2026 వరకు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే నడుపుతున్న వీక్లీ స్పెషల్ రైళ్ల సేవలను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ఈ పొడిగింపు వల్ల వెయిటింగ్ లిస్ట్ సమస్య కొంతవరకు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించనుంది.ప్రతి ట్రైన్ 4 ట్రిప్పులు నడవనుంది. కాచిగూడ-మధురై, హైదరాబాద్-కొల్లం, హైదరాబాద్-కన్యాకుమారి, నరసాపూర్-తిరువణ్ణామలై మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 2026 వరకు నడపనున్నట్లు తెలిపింది.
































