హమ్మయ్య ముప్పు తప్పింది.. ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏపీకి తుపాను ముప్పు తప్పింది. మలక్కా జలసంధి ప్రాంతంలో బలపడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. తుపానుకు సెనియార్‌గా నామకరణం చేశారు.


అయితే, 24గంటల తరువాత తుపాను క్రమంగా బలహీన పడుతుందని, బంగాళాఖాతంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

మలక్కా జలసంధి, దానికి అనుకొని ఉన్న ఈశాన్య ఇండోనేషియా సమీపంలో సెనియార్ తుపాను కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మలక్కా జలసంధిలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారింది.. గత ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దాదాపు పశ్చిమ దిశగా కదిలి.. తుపాను సెనియార్‌గా మారింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఇవాళ మధ్యాహ్నానికి ఇండోనేషియా తీరం వైపు వెళ్లనుంది. దీంతో భారతదేశానికి, ఏపీకి సెనియార్ ముప్పు తప్పిందని వాతావరణ శాఖ పేర్కొంది.

మరోవైపు శ్రీలంక సమీపంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర – వాయవ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.