సర్కారు బాలసదన్లో ఆశ్రయం పొంది పెళ్లీడుకు వచ్చిన ఓ అనాథ యువతికి మార్చి 9, ఆదివారం ప్రభుత్వ అధికారులే దగ్గరుండి పెళ్లి జరిపించారు. అమ్మనాన్నల బాధ్యత తీసుకుని పుస్తెలు, మెట్టెలు సహా అనేక కానుకలు అందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఈ దంపతులకు సర్కారే అండగా ఉంటుందని.. తల్లిదండ్రుల పాత్రను తామే తీసుకుంటామన్నారు అధికారులు.
పూజా అలియాస్ మౌనిక… చిన్నతనంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. కన్నవారు తప్ప ఎవరూ లేకపోవడంతో పూజతోపాటు, ఆమె ముగ్గురు చెల్లెళ్లలను ప్రభుత్వం చేరదీసింది.. బాలసదన్లో ఆశ్రయం కల్పించి వారికి చదువు చెప్పించింది ప్రభుత్వం. వీరిలో పూజ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని కంప్యూటర్ శిక్షణ తీసుకుని ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. పెళ్లీడుకొచ్చిన పూజకు పెళ్లి చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తనకు నచ్చిన సాయితేజతో పెళ్లి జరిపించాలని అధికారులను కోరింది పూజ. మంథని పట్టణానికి చెందిన సాయతేజ కుటుంబం గురించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. పూజతో సాయితేజకు వివాహం జరిపిస్తే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న కోణంలో తల్లిదండ్రుల్లాగా అందరినీ అడిగి ఓ నిర్ణయానికి వచ్చారు. సాయితేజ కుటుంబానికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు లేని పూజకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని చెప్పారు. అంతేకాదు.. ఆమె చెళ్లెళ్లకు కూడా భవిష్యత్తులో మీరు బంధువులుగా సాయం అందించాలని చెప్పారు. అన్నింటికీ సాయితేజ కుటుంబీకులు ఒప్పుకోవడంతో ఆదివారం ప్రభుత్వ అధికారుల సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మహిళా సంక్షేమ అధికారి సబిత, ఇతర అధికార యంత్రాంగమంతా హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి నవదంపతలును ఆశీర్వదించారు.
పెళ్లి కూతురుకు అమ్మానాన్ని లేరనే లోట తెలియకుండా భాజా భజంత్రీల నడుమ, కమ్మని విందు బోజనాలు ఏర్పాటు చేసి పెళ్లి తంతు నిర్వహించారు. తాలిబొట్టు, మెట్టెలు, ఇంట్లోకి కావాల్సిన పట్టు పరుపులు, మంచం, ఇతర గృహపకరణాలన్నీ అధికారులు తలో చేయి వేసి అందించారు. కొందరు దాతలు కూడా ముందుకు వచ్చి పూజ వివాహానికి ఆర్థిక సహాయం అందించారు. టీఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు కూడా తమ వంతు సాయం అందించారు… తల్లిదండ్రులను కోల్పోయి ముగ్గురు చెల్లెళ్లతో సహా ప్రభుత్వ ఆశ్రమంలో చేరిన ఓ యువతి పెళ్లీడుకు రావడంతో ప్రభుత్వమే పెళ్లి చేస్తోందని చెప్పారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. 20 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేయడం కొంత ఇబ్బందిగా ఉన్నా.. భవిష్యత్తులోనూ ఆమెను బాగా చదివించాలని సాయితేజను కోరినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం తరపున ఏం కావాలన్నా సాయం అందిస్తాం. తనకు ఎవరూ లేరను అనుకోవద్దని.. తనకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వారు జీవితంలో స్థిరపడేందుకు సర్కారు అండగా ఉంటుందని చెప్పారు.
పూజకు తాను అనాథను అనే విషయం గుర్తుకు రాకుండా ఐదు రోజుల పెళ్లి అంగరంగ జరిపించారు. ఇప్పటికే మెహిందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ వంటివి కూడా నిర్వహించారు. అధికారులే పూజను ఇంటికి తీసుకెళ్లి పెళ్లి కూతురుగా ముస్తాబు చేసారు. జిల్లా యంత్రాంగమంతా హాజరై అక్షింతలతో ఆశీర్వదించగా… పూజా, సాయితేజ ఓ ఇంటివారయ్యారు. ఐదు రోజుల పాటు ఘనంగా పెళ్లి చేశారు… చాలా సంతోషంగా ఉందని చెప్పారు పూజ. తన వివాహానికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి సాయితేజ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తామిద్దరం చాలా ఆనందంగా ఉంటామని చెప్పారు. తామిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని.. తన తల్లిదండ్రులు సహకరించారన్నారు సాయితేజ.
నారు పోసినవాడే నీరు పోస్తాడని చాలా మంది చెబుతుంటారు. నిజంగానే పూజతో పాటు, తన చెళ్లెళ్లకు సర్కారు అండగా నిలిచింది. వారని చదివించడమే కాదు… ఓ మంచి పెళ్లి సంబంధం కుదుర్చడంలో పెళ్లి పెద్దపెద్దల పాత్ర పోషించింది. సర్కారు చేసిన ఈ పెళ్లి శుభప్రదం కావాలని…. నవ దంపతులు భవిష్యత్తులో ఆదర్శ జంట అవాలని ఆశిద్దాం…