ఎస్‌బీఐ అందిస్తున్న బెస్ట్ ఎఫ్‌డీ పథకాలు ఇవే.. సమయం లేదు త్వరపడండి.

www.mannamweb.com


మన దేశీయ మార్కెట్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మంచి డిమాండ్ ఉంది. అందరూ వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గుచూపుతారు. ఎందుకంటే దీనిలో స్థిరమైన వడ్డీ, కచ్చితమైన రాబడిని అందిస్తుండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలో అన్ని పబ్లిక్, ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్సీ సంస్థలు పెట్టుబడిదారులకు ఆకర్షించేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. పోటాపోటీగా వడ్డీరేట్లను అందిస్తున్నాయి. ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కూడా పలు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. ఇటీవలే అమృత్ వృష్టి అనే కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం దేశీయ, ఎన్‌ఆర్ఐ కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. వీటితో పాటు ఎస్‌బీఐ అమృత్ కలాష్, ఎస్‌బీఐ వీకేర్ వంటి ఇతర పథకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఈ బ్యాంకులో అందుబాటులో ఉన్న ఇతర ఎఫ్‌డీ పథకాల గురించి తెలుసుకుందాం..

అమృత్ కలాష్, వీకేర్ పథకాలు..

ఎస్బీఐ అమృత్ కలాష్ పథకం సాధారణ, సీనియర్ సిటిజన్‌ల కోసం అయితే.. ఎస్బీఐ వీకేర్ మాత్రం కేవలం సీనియర్ సిటిజన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అమృత్ కలాష్ పథకం 400 రోజుల పాటు అమలులో ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు సంవత్సరానికి 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 7.60 శాతం అధిక రేటును పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఎస్బీఐ వెబ్‌సైట్ ప్రకారం, ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 12, 2023 నుంచి అమలులో ఉన్నాయి. ఎస్బీఐ వీకేర్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్‌ల కోసం రూపొందింది. ఇది సాధారణ వడ్డీ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం కొత్త డిపాజిట్లు, పునరుద్ధరణలు రెండింటికీ అందుబాటులో ఉంది. ఇది కూడా సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది.

ఎస్బీఐ అమృత్ వృష్టి..

అమృత్ వృష్టి యోజన 444 రోజుల స్కీమ్. డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ డిపాజిట్లపై పెట్టుబడిదారులు రుణాలు తీసుకోవచ్చు. ఈ పథకానికి గడువు 2025 మార్చి 31.

ఎస్బీఐ సర్వోత్తమ్..

ఎస్‌బీఐ సర్వోత్తమ్ పథకం అనేది పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసే పెట్టుబడిదారుల కోసం. ఇది సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రేట్లను అందిస్తుంది. 2-సంవత్సరాల కాలానికి, వడ్డీ రేటు 7.4 శాతం, 1-సంవత్సరానికి, ఇది 7.10 శాతం. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం సంపాదిస్తారు. రూ. 1 కోటి నుంచి రూ. 3 కోట్ల వరకు డిపాజిట్లకు సర్వోత్తమ్ (నాన్-కాలబుల్) ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఎస్బీఐ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్..

పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు మద్దతుగా ఎస్బీఐ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్‌ను ప్రారంభించింది. ఇది 1111 లేదా 1777 రోజులకు 6.65 శాతం వడ్డీ రేటును, 2222 రోజులకు 6.40 శాతం అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు డిపాజిట్ వ్యవధిని బట్టి 7.40 శాతం వరకు అందిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడికి గడువు లేదు.