పానీ పూరీ బ్యాన్‌ దిశగా ఈ రెండు రాష్ట్రాలు!?.. ఎందుకంటే..

బెంగళూరు/చెన్నై: పానీ పూరీ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌. కర్ణాటక, తమిళనాడులో పానీ పూరీని బ్యాన్‌ చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.


పానీ పూరీలో క్యాన్సర్‌ కారక పదార్దాలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, పానీ పూరి అనేక వ్యాధులకు కారణమవుతోందని ఫుల్‌ సెఫ్టీ అధికారులు గుర్తించారు. వీటిని అమ్మేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పానీపూరీ తిన్న వారు డయేరియా, టైఫాయిడ్, జాండిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక, తాజాగా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా దీనిలో 40 భద్రతా ప్రమాణాలు విఫలమయ్యాయని తేలింది.

వీటిలో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు. వీటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాలను కనుగొన్నారు. పానీ పూరిలో రంగుల వాడకమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక, ఇప్పటికే కర్ణాటకలో గోభీ మంచూరియన్, కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్‌లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించారు.

ఇక, తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1500 పానీ పూరీ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. అలాగే, చాట్ మసాలాలలో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా కూడా గుర్తించారు. దీంతో, పానీ పూరీని బ్యాన్‌ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.