శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక సామాన్యమైన రోగిలా మారువేషంలో ఆసుపత్రికి వచ్చి అక్కడి రోగుల సమస్యలను తెలుసుకున్న రాజు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు.
మారువేషంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళిన మడకశిర ఎమ్మెల్యే
నేడు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తలకు క్యాప్ పెట్టుకొని, మాస్క్ ధరించి, చేతిలో ఒక పాత మొబైల్ ఫోన్ తీసుకుని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిగేటు వద్ద నుండి నేరుగా ఆసుపత్రి లోపలికి వెళ్లి వార్డులు, ఓ పి డి రూములు, మందుల డిస్పెన్సరీల వద్ద ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించారు. మారువేషంలో ఉన్న ఆయనను ఎవరు గుర్తించకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు క్లియర్ గా తెలుసుకోగలిగారు.
ఆస్పత్రి పనితీరును, రోగుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే
ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులలో డాక్టర్లు సమయానికి వస్తున్నారా? సరిగ్గా ఇస్తున్నారా? డాక్టర్ల కోసం ఎంతసేపు ఎదురు చూడాల్సి వస్తుంది? వంటి అనేక ప్రశ్నలు వారిని అడిగి తెలుసుకున్నారు. కొందరు డాక్టర్ల పనితీరు పైన అసహనం వ్యక్తం చేస్తే, మరికొందరు ఔషధాల డిస్పెన్సరీ లలో మందులు స్టాక్ లో లేవని చెబుతున్నారని ఎమ్మెల్యేకు చెప్పారు.
మాస్క్ తొలగించిన ఎమ్మెల్యేను చూసి రోగులు ఆశ్చర్యం
ఒక వృద్ధుడయితే స్కానింగ్ కోసం రోజంతా వేచి ఉండాల్సి వస్తుందని, ఇక ఆసుపత్రిలో పడకలు కూడా తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని వారు చెప్పారు. ఇక ఈ సమస్యలన్నింటిని స్వయంగా రాసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, ఆపై తన మాస్క్ ను తొలగించి అక్కడ ఉన్న రోగులకు కనిపించారు. దీంతో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును గుర్తించిన రోగులు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని ఎమ్మెల్యే ఏమన్నారంటే
ఎమ్మెల్యే ఇలా మారువేషంలో వచ్చి సమస్యలు తెలుసుకోవడం చాలా గొప్ప విషయమని దీనిపైన స్థానికులు మాట్లాడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజు డ్యూటీ డాక్టర్లు, నర్సులు, అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో మాట్లాడి సమయపాలన పాటించాలని, రోగులకు సకాలంలో చికిత్సలు అందించాలని వారి బాధ్యతను గుర్తు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మందుల స్టాక్ లేకపోవడం పైన, సిబ్బంది పనితీరు పైన లోపాలను ప్రశ్నించారు. ఇక మడకశిర ఎమ్మెల్యే మారువేషంతో ఆసుపత్రిలో అలసత్వం ప్రదర్శిస్తున్న వారందరికీ తన చర్యతో ఒక హెచ్చరికను జారీ చేసి మడతెట్టేశారు.
































