బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి

www.mannamweb.com


కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీని వైఎస్ షర్మిల పరిశీలించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీ వద్ద కావాలనే పడవలను వదిలారా? అని సందేహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులు ఎవరో గుర్తించి.. వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు.

గతంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపి ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ స్తంభాలు సైతం దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి ఎంతో ఘన చరిత్ర ఉందని ఈ సందర్బంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు.

అలాంటి బ్యారేజీ గేట్లు విరిగి పోయిన అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించకుంటే.. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రకాశం బ్యారేజీ మరమ్మతు పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు.

గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, బ్యారేజీలకు వార్షిక నిర్వహణ కూడా చేపట్టలేదని ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మండిపడ్డారు. కనీసం రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను సైతం గత జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆ క్రమంలో పలు ప్రాజెక్టుల గేట్లు సైతం ఊడి.. నదులో తెలియాడాయని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు వార్షిక నిర్వహాణ చేపట్టేలా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టాలన్నారు.