అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలను.. నోబెల్ జ్యూరీ ప్రకటిస్తోంది.. ముందుగా వైద్య విభాగానికి సంబంధించి నోబెల్ పురస్కారాలను జ్యూరీ సోమవారం ప్రకటించింది. వైద్య శాస్త్రంలో చేసిన విశేష కృషికిగాను ప్రముఖ శాస్త్రవేత్తలు.. మేరీ ఇ.బ్రున్కో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకాగుచీకి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అంచించనున్నట్లు పేర్కొంది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13 వరకు కొనసాగనుంది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేయనున్నారు..
అమెరికా, జపాన్ శాస్త్రవేత్తలు..
కాగా.. రోగనిరోధక వ్యవస్థను ఎలా అదుపులో ఉంచుతారనే దానిపై పరిశోధన చేసినందుకు అమెరికాకు చెందిన మేరీ ఇ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, జపాన్కు చెందిన షిమోన్ సకాగుచి సోమవారం వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారని నోబెల్ జ్యూరీ తెలిపింది.
“పరిధీయ రోగనిరోధక సహనానికి (peripheral immune tolerance) సంబంధించిన వారి ఆవిష్కరణలకు” ఈ ముగ్గురినీ సత్కరించినట్లు నోబెల్ జ్యూరీ పేర్కొంది. “వారి ఆవిష్కరణలు కొత్త పరిశోధనా రంగానికి పునాది వేశాయి.. క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల వంటి కొత్త చికిత్సల అభివృద్ధికి దోహదపడ్డాయి” అని వెల్లడించింది.
నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రం అలాగే ఆర్థిక శాస్త్రం కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన సామాజికవేత్తలకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు వ్యాపారవేత్త, ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి. విజేతలను వివిధ సంస్థల నుంచి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలు ఎంపిక చేస్తాయి. మిగతా పురస్కారాలను త్వరలో ప్రకటించనున్నారు.
































