తిరుమల శ్రీవారి పూల అలంకారంలో దాగిన విశేషాలు తెలుసా..! ఎన్ని రకాల హారాలు వాడతారంటే..

www.mannamweb.com


శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనదిగా నిలిచింది. పవిత్రమైన కార్యమని తిరువాయ్‌ మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలోనూ ఈ విషయం ఉంది.

స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో అలంకరించే అర్చకులు ఎన్నో పుష్పహారాలను దేవదేవునికి సమర్పిస్తారు.

శిఖామణి: కిరీటం మీద నుంచి రెండు భుజాలమీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి. ఇది ఎనిమిది మూరల దండ.

సాలిగ్రామ మాల: శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉండే సాల గ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండుమాలలు కాగా ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటాయి.

కంఠసరి: శ్రీవారి మెడలో రెండు పొరలుగా రెండు భజాలపై అలంకరింపబడే దండ కంఠసరి. ఇది ఒకటి మూడున్నర మూరలు ఉంటోంది.

వక్షస్థల లక్ష్మి: శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవీ లకు అలంకరించే రెండు పూలదండల్లో ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది.

శంఖుచక్రం: శంఖుచక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు. ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.

కఠారిసరం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బొడ్డున వున్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఇది. ఈ పూదండ రెండు మూరలుగా ఉంటుంది.

తావళములు: రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు వ్రేలాడదీసే మూడు దండలే తావళములు. ఇందులో ఒకటి మూడు మూరలు, మరొకటి మూడున్నర మూరలు, ఇంకొకటి నాలుగు మూరలు ఉంటుంది.

తిరువడి దండలు: శ్రీవారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలే తిరువడి దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర ఉండగా ప్రతి గురువారం జరిగే పూలంగి సేవ లో మాత్రమే స్వామివారి మూలమూర్తి కి ఆభరణాలన్నీ తీసివేసి ఈ మాలలతో పాటు నిలువెల్ల స్వామి వారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.

ఇవిగాక శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవమూర్తులకు కూడా ఎన్నో పూలమాలలు టిటిడి సిద్ధం చేస్తుండగా అర్చక స్వాములు అలంకరిస్తారు. ఉత్సవమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండల్లో భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ, కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయ్పప్పస్వామికి మూడు దండలు అర్చకులు అలంకరిస్తారు.

ఇక బంగారువాకిలి ద్వారపాలకులకు రెండు దండలు, గురడాళ్వారు కు ఒక దండ. వరదరాజస్వామి మరొక దండ, వకుళమాలిక ఒక దండ, భగవద్రామానుజులుమూలమూర్తి, ఉత్సవమూర్తికి రెండు దండలు. యోగనరసింహస్వామికి ఒక దండ. విష్వక్సేనులవారికి ఒక దండ. పోటు తాయారుకు ఒక దండ, బేడి ఆంజనేయస్వామికి మరో పూల దండ, శ్రీ వరాహస్వామి ఆలయానికి మూడు దండలను టిటిడి సమకూర్చుతోంది.

ఇక కోనేటిగట్టు ఆంజనేయస్వామికి ప్రతి ఆదివారం మాత్రమే పూల దండ అలంకరిస్తోంది టిటిడి. ఇంకా శ్రీవారి నిత్యకల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడ ఈ పూల అరలో కూర్చ బడుతున్న అర్చకులు వెంకన్నను అలంకార ప్రియుడిగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

మాలలకు గానూ తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్న జాజులు, మొల్లలు, మొగిలి, కమలం, కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపు చెట్లు, కనకాంబరం, మరువం, మాచీ పత్రం, దవనం, బిలువం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలును వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను, పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యంలో వినియోగిస్తున్నారు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా శ్రీవారికి జరిగే పుష్ప కైంకర్యం తోమాల సేవకు గాను పుష్ప అర నుండి సిద్ధం చేయబడిన పూల మాలలను, జియ్యంగార్లు తలపై పెట్టుకొని బాజా భజంత్రీలతో ఛత్ర చామర మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్థంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది. ఇలా తిరుమల క్షేత్రంలో శ్రీవారికి నిత్యం సమర్పించే పూలదండలు వెదజల్లే సువాసనలు, అలంకరణలు భక్తుల్ని మైమరిపిస్తున్నాయి.