తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజైన బుధవారం సాయంత్రం 2,668 అడుగుల ఎత్తుగల మహా కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు.
దీని కోసం రాగి రాక్షస కొప్పరిని ఆలయ అధికారులు కొండపైకి తరలించేందుకు సిద్ధం చేశారు. ఇక బుధవారం ఉదయం 4గంటలకే ఆలయ రాజగోపురం ఎదుట భరణి దీపం వెలిగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మహా దీపాన్ని కొండపైన వెలిగిస్తారు. ఇందుకోసం ఆరు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు, కలిగిన రాగి రాక్షస కొప్పరిని ఆలయ గోపురం సమీపంలోని నంది విగ్రహం వద్ద ఉంచి వేద మంత్రాల నడుమ మహా దీప కొప్పరికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోపూజ చేసి కొప్పరిని ఆలయ ప్రాంగణంలో ఉంచారు. సోమవారం ఉదయం కొప్పరికి ప్రత్యేక పూజలు చేసి సావల్ పూండి గ్రామానికి చెందిన వంశ పార్యపర్య గ్రామస్తులు అన్నామలైయార్కు హరోం… హరా… అంటూ నామస్మరణ చేస్తూ 2,668 అడుగుల ఎత్తుగల కొండపైకి రాక్షస కొప్పరిని తీసుకెళ్లనున్నారు. మహా దీపానికి ఉపయోగించే వెయ్యి మీటర్లు గాడా వస్త్రం, 3,500 కిలోల నెయ్యిని ఆలయంలో సిద్ధంగా ఉంచారు.
కొండపైకి అనుమతి నిరాకరించే అవకాశం
వర్షాలకు కొండ చరియలు, బండరాళ్లు కొండ పై నుంచి కింద పడుతుండటంతో గతంలో మాదిరిగా ఈ సంవత్సరం మహా దీపం వెలిగించే కొండపైకి భక్తులను అనుమతించేందుకు వీలు కలగదని భావిస్తున్నారు. భక్తులు కొండ కింద నుంచే మహా దీపాన్ని దర్శించుకునే వీలు కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే మహా దీపం కొండపైకి వెళ్లేందుకు ముందస్తు అనుమతి పొందిన వారిని మాత్రమే అనుమతించనున్నారు. భక్తుల తొక్కిస లాట లేకుండా చర్యలు చేపడుతున్నారు. అంబులెన్స్, అగ్ని మాపక వాహనాల సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
భక్తులు ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించరాదు
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు దీపోత్సవానికి రానున్న నేపథ్యంలో పట్టణంలో ప్లాస్టిక్ వస్తులు ఉపయోగించకుండా 75 మంది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు గుర్తింపు కార్డులు అందజేసి నిఘా ఉంచినట్లు కలెక్టర్ తర్పగరాజ్ తెలిపారు. భక్తులకు అక్కడక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసామని అదే విధంగా తాగునీటి వసతి, గిరివలయం రోడ్డులో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
రెండు మానవ రహిత విమానాలతో నిఘా
దీపోత్సవానికి సుమారు 40 లక్షల మంది భక్తులు పాల్గొననున్నారని ఇప్పటికే 50 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా గిరివలయం రోడ్డులో 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తులో పాల్గొంటారని, 17 యూనిట్ల మహిళా పోలీసులు బందోబస్తులో ఉంటారని ఎస్పీ సుధాకర్ తెలిపారు. ఆలయ రాజగోపురం పైనుంచి రెండు మానవ రహిత విమానాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బందోబస్తుకు వేలూరు, విల్లుపురం, కాంచిపురం వంటి నాలుగు రీజిన్ల నుంచి డీఐజీలు, 14 మంది ఎస్పీలు, 22 మంది అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు బందోబస్తుకు హాజరుకానున్నారు.
అశ్వ వాహనంపై చంద్రశేఖరుడి విహారం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిద రోజైన సోమవారం ఉదయం వినాయకుడు, చంద్రశేఖరుడు అశ్వ వాహనంలో మాడ వీధుల్లో ఊరేగారు. ఉదయం స్వామి వార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేసి అశ్వ వాహనంపై ఆశీనులు చేసి మాడ వీధుల్లో ఊరేగించారు.



































