Train Accident : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి.. 200 మందికి గాయాలు

Train Accident : పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..


దాదాపు 200 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ సీల్దా వైపు వెళుతోంది. అంతలో వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కతిహార్ డివిజన్‌లోని రంగపాణి-నిజ్‌బారి స్టేషన్‌ల మధ్య స్టేషన్‌లో నిలబడిన కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. తోపు బలంగా ఉండడంతో ఒక బోగీ మరో బోగీపైకి ఎక్కింది. ఈ ఘటన సమాచారంతో కతిహార్ రైల్వే డివిజన్‌లో కలకలం రేగింది. రైల్వే అధికారులు సహాయ రైలు, మెడికల్ వ్యాన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇంకెంత మంది చనిపోయారో అధికారికంగా ధృవీకరించలేదు. కాని సంఘటన స్థలం నుండి వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య స్పష్టంగా తెలియరాలేదు.

ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కంజన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొన్నట్లు సమాచారం. జిల్లా మేజిస్ట్రేట్, వైద్యులు, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.