Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్‌..!

www.mannamweb.com


బెంగళూరు: హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) అభ్యంతరక వీడియోల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించి తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని సదరు మహిళ వెల్లడించిందని జాతీయ మహిళా కమిషన్‌ తెలిపింది. దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు.(Karnataka Sex Scandal)

పత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సిట్ అధికారులు ఆ మహిళలను బెదిరించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాంగ్మూలాలు ఇవ్వకపోతే.. వ్యభిచారం కేసు నమోదు చేస్తామని భయపెట్టినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కిడ్నాప్‌నకు గురైన మహిళను మీరు ఎక్కడ ఉంచారు..? ఆమెను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు..?’’ అని ప్రశ్నించారు. కుమారస్వామి చేసిన ఆరోపణలపై కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర స్పందించారు. జేడీఎస్ నేతలు చేసే అన్ని ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సిట్ దర్యాప్తు నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు.

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హాసనకు చెందిన జేడీఎస్‌ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. వీటితోపాటు అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించి అభ్యంతరకర ఫొటోలు తీయడం వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోయారు. అతడిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. వారికి తెలియకుండా నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం లేదన్నారు. ఈ క్రమంలో అతడి దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశానని చెప్పారు.