ఆన్లైన్ మార్కెట్ అందుబాటులోకి వచ్చాక.. ఇంట్లో నుంచే మొబైల్ యాప్ ద్వారా అన్ని కాళ్ల దగ్గరకు రప్పించుకుంటున్నారు. కొన్ని వస్తువులు నిమిషాల వ్యవధిలో వస్తుంటే.. ఇంకొన్ని గంటల వ్యవధిలో వాకిట్లోకి వచ్చి పడుతున్నాయి. కంపెనీల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. కొంత మంది కస్టమర్ల కారణంగా లేనిపోని ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. ఆన్లైన్లో కత్తులు కొన్న వ్యక్తి.. ఇద్దరిని హతమార్చారు. దీంతో బ్లింకిట్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల రెండు వేర్వేరు హత్యలు జరిగాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కత్తులను బ్లింకిట్ నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు కూడా కస్టమర్లుగా నటిస్తూ అదే ప్లాట్ఫామ్ నుంచి కత్తిని కొనుగోలు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. బ్లింకిట్పై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని బ్లింకిట్ స్టోర్లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. 55 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 7.62 సెం.మీ పొడవు.. 1.72 సెం.మీ వెడల్పు ఉన్న బ్లేడ్లు కలిగిన కత్తులను మాత్రమే ఆన్లైన్లో విక్రయించాలి. అంతకంటే పెద్దది ఏదైనా అమ్మితే ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించినట్లే. ఇది క్రిమినల్ నేరంగా వస్తుంది. పోలీసులకు డెలివరీ చేయబడిన కత్తి 8 సెం.మీ పొడవు.. 2.5 సెం.మీ వెడల్పు కలిగి ఉంది. దీంతో చట్టపరమైన పరిమితులను మించిపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కత్తి ధర రూ.699కు విక్రయిస్తున్నారు.



































