‘మాకు దయతో రెండు స్థానాలిచ్చారేమో..!’ ఎగ్జిట్‌ పోల్‌పై సజ్జల అసహనం

Sajjala: ‘మాకు దయతో రెండు స్థానాలిచ్చారేమో..!’ ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌పై సజ్జల అసహనం


అమరావతి: ‘ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కాదు.. నవ్వొచ్చింది. ఆ ఫలితాల్లో వైకాపాకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారు. అవి కూడా దయతో ఇచ్చారేమో అర్థం కావట్లేదు. మరీ ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగోదు అనుకున్నారేమో’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎగ్జిట్‌ పోల్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో భాజపా పెట్టుకున్న 400 సీట్ల లక్ష్యం కోసం నంబర్లను సర్దుకుంటూ వెళ్లారేమోనని మండిపడ్డారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈసీ ఆదేశాలు బరితెగించి ఇచ్చినట్లుంది
‘పోస్టల్‌ బ్యాలట్లకు సంబంధించి తన మార్గదర్శకాలకు విరుద్ధంగా తాజాగా ఈసీ జారీచేసిన ఆదేశాలు బరితెగించి ఇచ్చినట్లు ఉన్నాయి. ఈ ఆదేశాలు తికమక పెట్టడానికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు. అధికారి సంతకం ఉంటే సరిపోతుందని.. సీల్, ఇతర వివరాలు అక్కర్లేదని చెబుతున్నారు. ఇది మరీ అడ్డగోలుగా ఉంది. సంతకం ఎవరిదన్న విషయం ఎవరికి తెలుస్తుంది? ఈసీ నిబంధనలకు వాళ్లే తూట్లు పొడిచారు. ఆ సంతకం సంబంధిత అధికారిది కాకపోవచ్చు. కానీ అధికారులు మాత్రం సీల్‌అవసరం లేదని చెప్పారు. అదీ మన రాష్ట్రంలోనే. అందుకే దీన్ని సవాలు చేశాం. హైకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు రాలేదు. సుప్రీంకోర్టులో వేశాం. ఏం వస్తుందనేది నేడో, రేపో తెలుస్తుంది’ అని తెలిపారు.