UK elections: క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్‌

లండన్: బ్రిటన్ పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ (Conservative Party) ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు.


‘‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీని విజయం వరించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’’ అని సునాక్‌ తెలిపారు. ఫలితాల అనంతరం తన సొంత నియోజకవర్గం రిచ్‌మండ్‌ అండ్‌ నార్తర్న్ అలర్టన్‌లోని పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని క్షమించమని కోరుతూ.. ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, సునాక్‌ మరో దఫా ఎంపీగా విజయం సాధించారు.

ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌, వేల్స్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. లేబర్ పార్టీ మెజార్టీ మార్కును దాటేసింది. భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న ఆ పార్టీ.. 400 మార్కు దిశగా పయనిస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ 80 స్థానాలు దాటింది.

గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్లక్రితం ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్‌ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ రేటింగ్‌లు పడిపోతూ వచ్చాయి.

కీర్‌ స్టార్మర్‌ విక్టరీ స్పీచ్‌..
ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ (Keir Starmer) ప్రసంగించారు. బ్రిటన్‌ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన తన మద్దతుదారులతో మాట్లాడుతూ.. 14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘మీ అందరికి కృతజ్ఞతలు. మన దేశాన్ని మీరు మార్చారు. ప్రజల తీర్పు మనపై పెద్ద బాధ్యతను ఉంచింది. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలుపెడదాం’’ అని పిలుపునిచ్చారు.