అమెరికాలో వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉరుముతున్న వేళ భారతీయులకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బ్రిటన్ లోనూ అక్కడి కైర్ స్టార్మర్ ప్రభుత్వం వీరికి షాకిచ్చింది.
భారతీయులతో పాటు వలసదారులందరికీ షాకిచ్చేలా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ లో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తున్న వలసదారులందరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఇందులో భారతీయులపై ఎక్కువ ప్రభావం పడబోతోందని అంచనా.
బ్రిటన్ కు వెళ్లే వలసదారులు అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటివరకూ ఐదేళ్ల వెయిటింగ్ టైమ్ ఉండేది. ఇప్పుడు దాన్ని పదేళ్లకు పెంచుతూ కైర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ లో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విదేశీయులకు పదేళ్ల నిరీక్షణ తప్పదన్న మాట. దేశంలోకి ప్రతీ ఏటా పెరుగుతున్న వలసల్ని దృష్టిలో ఉంచుకుని స్టార్మర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బ్రిటన్ కు భారత్ నుంచి భారీ ఎత్తున వృత్తి నిపుణులు, విద్యార్ధులు వలస వెళ్తుంటారు. వీరందరూ ఇప్పటివరకూ ఐదేళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా పదేళ్లు ఆగక తప్పదు. ఈ ప్రభావం భారతీయులపై తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం బ్రిటన్ కు ఎక్కువగా వలస వెళ్తున్న వారిలో భారతీయులు టాప్ లోనే ఉన్నారు.
ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 2023లో బ్రిటన్ కు వలస వచ్చిన వారిలో భారతీయులు అతిపెద్ద సమూహంగా ఉన్నారు. దాదాపు 2.5 లక్షల మంది ఇక్కడికి ప్రధానంగా ఉద్యోగాలు,, విద్యా అవకాశాల కోసం వచ్చారు.బీబీసీ అంచనాల ప్రకారం వలసదారులు నిరవధికంగా ఉండటానికి లేదా సాంకేతికంగా నిరవధిక సెలవు కోసం మిగిలిపోయే హక్కు కోసం దరఖాస్తు చేసుకునే ముందు 10 సంవత్సరాలు బ్రిటన్ లో నివసించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో భారతీయులకు అక్కడ చుక్కలు కనిపించేలా ఉంది.




































