తిమ్మాపురం వద్ద యూనిటీ మాల్‌

www.mannamweb.com


భీమిలి బీచ్‌ రోడ్డులో తిమ్మాపురం వద్ద రామానాయుడు స్టూడియో సమీపాన యూనిటీ మాల్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మాల్‌ నిర్మాణానికి గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.172 కోట్లు మంజూరుచేసింది. రాష్ట్రంలో మూలధన పెట్టుబడుల్లో భాగంగా ఏర్పాటుచేసే యూనిటీ మాల్‌ వల్ల చేనేత, చేతివృత్తుల ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా పర్యాటక రంగం విస్తరిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఐదెకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న మాల్‌ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించింది. మాల్‌ నిర్మాణానికి బిడ్లు, ఇతరత్రా మౌలిక వసతుల కల్పన బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించారు. ఏపీఐఐసీ, మాల్‌కు నోడల్‌ ఏజెన్సీగా ఉండే చేనేత, జౌళి శాఖల మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగింది. గత నెలలో విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు యూనిటీ మాల్‌ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరీంధిర్‌ ప్రసాద్‌ సోమవారం మాల్‌ నిర్మాణానికి సముద్రానికి అభిముఖంగా రామానాయుడు స్టూడియోస్‌ వద్ద ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. సర్వే మ్యాపును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట రూరల్‌ తహసీల్దార్‌ పాల్‌కిరణ్‌ ఉన్నారు.