విజయ్‌కి కొడుకు బిగ్ షాక్… ఇంటి పేరు మార్చుకున్న జాసన్ సంజయ్!

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు మరో షాక్ తగిలిందనే వార్తలు కోలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే భార్య సంగీతతో విడాకుల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన వేళ, ఇప్పుడు ఆయన కుమారుడు జాసన్ సంజయ్ తన పేరులోని ‘వి’ ఇన్షియల్‌ను తొలగించి తల్లి సంగీత పేరుతో ‘ఎస్’ ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాసన్ ఇలా చేయడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది.
తమిళ స్టార్ హీరో విజయ్ ‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమాల ద్వారా కోట్లాది మందిని అభిమానులుగా మార్చుకున్న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీని స్థాపించి ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ వివాదాలు పెరుగుతూ వస్తున్నాయి. భార్య సంగీతతో ఆయన విడాకుల వ్యవహారం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 20న విచారణ జరగనుండగా, ఆ రోజున విజయ్ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తాజాగా తన పేరులో ఉన్న ఇన్షియల్‌ను మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తమిళనాడులో పిల్లలు తమ తండ్రి పేరులోని మొదటి అక్షరాన్ని తమ పేరుకు ఇన్షియల్‌గా ఉపయోగించడం ఆనవాయితీ. కానీ జాసన్ సంజయ్ మాత్రం తన తండ్రి విజయ్ పేరుతో వచ్చే ‘వి’ అక్షరాన్ని తొలగించి, తన తల్లి సంగీత పేరులోని ‘ఎస్’ అక్షరాన్ని పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జాసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ‘సిగ్మా’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న జాసన్ ఆ సినిమా టైటిల్ కార్డులో తన తండ్రి పేరుకు సంబంధించిన ఇన్షియల్‌ను ఉపయోగించకపోవడం ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. విజయ్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విజయ్ విడాకుల వ్యవహారం అభిమానులను కలవరపెడుతుండగా, ఇప్పుడు కుమారుడి ఇన్షియల్ మార్పు వార్తలు రావడంతో అభిమానులు మరింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉండగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై విజయ్ ఇటీవల స్పందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నై సమీపంలోని చెంగల్పట్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ తన వ్యక్తిగత సమస్యల గురించి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అవన్నీ తానే పరిష్కరించుకుంటానని, పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.