విశాఖ రైల్వే స్టేషన్కు అరుదైన గుర్తింపు లభించింది. భారతీయ రైల్వే చరిత్రలోనే తొలిసారి రోబో కాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తూర్పు కోస్తా జోన్ వాల్తేరు డివిజన్ పరిధిలోకి ఈ రైల్వే స్టేషన్ వస్తుంది.
ఈ రోప్ కాప్ను ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) అలోక్ బొహ్రా, డీఆర్ఎం లలితో బొహ్రా చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ, ప్రయాణికులకు సాయం చేయడం, రద్దీ నియంత్రణ, పారిశుద్ధ్యం, భద్రతాపరమైన అంశాలపై పర్యవేక్షణకు ఈ రోబో సేవలను రైల్వే పోలీసులు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అధునాతన కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతతో రైల్వే పోలీసులకు సహాయపడుతుందన్నారు.
స్టేషన్లో నిత్యం పహారా కాస్తు అనుమానితులను గుర్తించడం, చొరబాటుదారులను కనుగొనడం వంటివి ఈ రోబో కాప్ చేస్తుంది. తరచూ దొంగతనాలకు పాల్పడేవారిని, అనుమానితుల చిత్రాలు తీసి విశ్లేషించి గుర్తించడంలో సహాయపడుతుందన్నారు. హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రజలను అప్రమత్తం చేస్తుందన్నారు. ఈ రోబోకు రైల్వే పోలీసులు ‘ఏఎస్పీ అర్జున్’ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో పలు రైల్వే స్టేషన్లలో ఈ తరహా రోబోల సేవలను వినియోగించుకుంటామని వారు తెలిపారు.



































