మే 31న భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ.. ముందస్తు బెయిల్ ఏమైందంటే..?

మే 31న భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ.. ముందస్తు బెయిల్ ఏమైందంటే..?
కర్ణాటక సెక్స్ స్కాండల్‌ కేసులో కీలక పరిణామం శుక్రవారం (మే 31న) జరగబోతోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకోనున్నాడు.
బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్ పోర్టులో ఆయన కాలు మోపగానే అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) అధికారులు సర్వం సిద్ధం చేశారు.
మ్యూనిచ్ (జర్మనీ) టు బెంగళూరు విమానం టికెట్‌ను ఇప్పటికే ప్రజ్వల్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చేరుకున్న వెంటనే తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ప్రజ్వల్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.
దీంతో ఎయిర్‌పోర్టులోనే ప్రజ్వల్‌ను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులకు లైన్ క్లియర్ అయింది. గతంలోనూ ప్రజ్వల్ రెండుసార్లు జర్మనీ నుంచి బెంగళూరుకు విమాన టికెట్లను బుక్ చేసుకొని క్యాన్సల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరి ఈసారైనా ఆయన వస్తారా ? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మే 31న సిట్ ఎదుట విచారణకు హాజరవుతానంటూ మే 27న ప్రజ్వల్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
సెక్స్ స్కాండల్ బయటపడటంతో ఆయన ఏప్రిల్ 26న దేశం విడిచి జర్మనీకి పారిపోయారు. అప్పటి నుంచి మ్యూనిచ్ నగరంలోనే ఉన్నారు.