శ్రీవారి తిరునామాన్ని ఏమని పిలుస్తారు? భక్తులు ఎందుకు తిరునామాన్ని ధరించాలో తెలుసా..

నాతన ధర్మంలో తిరునామానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తిరునామం సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రతీకగా భావిస్తారు. అందుకనే తిరుమల క్షేత్రానికి చేరుకోగానే ప్రతి భక్తుడు తమ నుదిటిన తిరునామాన్ని ధరిస్తాడు.


ఇలా తిరునామాన్ని ధరించిన భక్తులు తమకు తోడుగా స్వామివారు ఉన్నాడని భావిస్తారు. అందుకనే ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టిన చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో సత్ప్రవర్తనతో, భక్తిభావంతో మెలగుతారు.

తిరునామాన్ని నుదిటిపై ధరించడం అనేది భక్తి, ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. భక్తులు తమ దేవుని పట్ల భక్తిని, విశ్వాసాన్ని చాటుకోవడానికి ఒక మార్గం. తిరునామం ధరించడం వలన మనిషిని ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుందని, ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని నమ్ముతారు.

అందుకనే భక్తుల్లో భక్తిభావన పెంచేందుకు సంప్రదాయం విశిష్టత తెలియజేసేందుకు తిరుమలలో టీటీడీ శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు క్షేత్రంలోని వివిధ ప్రాంతాల్లో తిరునామధారణ చేయిస్తోంది.ఇందుకోసం రోజుకు రెండు షిప్టుల్లో 130 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు.

భక్తులకు తిరునామ ధారణ చేసేందుకు నామకోపు, ఎర్రసింధూరం వినియోగిస్తారు. తిరునామం పెట్టుకుంటే చలువ చేస్తుందని కూడా కొందరు భక్తుల అభిప్రాయం.టిటిడికి ఈ నామకోపు, ఎర్రసింధూరం భక్తుల నుంచి విరాళంగా అందుతోంది. తిరునామధారణ కోసం ప్రత్యేకంగా రాగితో తయారుచేసిన కప్పు, మూడు నామాల ముద్రను ఉపయోగిస్తారు. వీటిని తూర్పుగోదావరి జిల్లా మండపేట నుండి టిటిడి కొనుగోలుచేసింది.

అసలు తిరునామం అంటే వైఖానస సంప్రదాయం ప్రకారం నాశిక పై భాగం నుంచి నుదుటి పై భాగం వరకూ అలంకరించబడి ఉండే నామం. తిరునామం అనేది తమిళ పదం. దీని అర్థం పవిత్రమైన నామం. తిరు అంటే శ్రీ, నామం అంటే తిలకం.. అందుకనే తిరునామాన్ని శ్రీనామం అని కూడా అంటారు. వైష్ణవ సంప్రదాయంలో, దైవత్వాన్ని సూచించడానికి నుదుటిపై తెల్లటి మట్టితో లేదా చందనంతో దిద్దబడి ఉంటుంది.

అయితే ఈ తిరునామం మూడు రకాలుగా ఉంటుంది. వైష్ణవుల్లోని ఒక తెగ అయిన వడగలై వారు ఆంగ్ల అక్షరం యు ఆకారంలో ఊర్ధ్వపుండ్రాలు నామం దిద్దుకుంటారు. మరో తెగ తెంగలైవారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం ధరిస్తారు.

అయితే శ్రీవారి నుదుటన దిద్దే తిరునామం ‘యు’, ‘వై’ ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం ‘ప’ ను పోలివుంటుంది. అందుకనే స్వామివారి తిరునామాన్ని ‘తిరుమణికావు’ నామంగా పిలుస్తారు.

గురువారం ఆభరణాలను తొలగించి నిజ రూప దర్శనం సమయంలో కళ్లు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూంటుంది.

తిరుమణికాపు నామాన్ని స్వామివారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తర్వాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. ఇందుకుగాను 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.