జపమాలలు ఎన్నో ఉన్నాయ్? వాటిలో కరుంగలి మాల ఒకటి. జపమాలగా వినియోగించవచ్చు లేదంటే మెడలో వేసుకోవచ్చు. సెలబ్రెటీల నుంచి సామాన్యుడి వరకూ ఇప్పటి తరం ఎవరి మెడలో చూసినా కరుంగలి మాల కనిపిస్తోంది.
ఈ పూసలు ఎలా తయారవుతాయి?
రుద్రాక్ష అంటే రుద్రాక్ష చెట్టునుంచి వస్తుంది..మరి కరుంగలి పూసలు ఎలా అంటారా? ఇవి నల్లమల అనే చెక్కతో తయారైనవి.కారుకలి అనే చెట్టునుంచి తయారు చేస్తారు. కారుకలి చెట్టుకి విద్యుత్ అయస్కాంత కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందట..అందుకే ఈ చెక్కను ఆలయ గోపురాలు, విగ్రహాల తయారీలో వినియోగిస్తారు.
ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారు?
కారుకలి చెట్టునుంచి వచ్చిన చెక్కతో తయారైన కరుంగలి మాల ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఈ చెట్టు బెరడును, వేరును ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. మధుమేహం, పేగు సంబంధిత రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చిన సమస్యలకు ఈ చెట్టు బెరడు నుంచి తయారు చేసిన ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఈ చెట్టు వేర్లతో కషాయం పెట్టుకుని తాగితే అల్సర్లు మాయమైపోతాయి. రక్తంలో ఐరెన్ కంటెంట్ పెంచేందుకు కూడా కరుంగలి మాల ఉపయోగపడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లని రంగు కుజుడికి , శనికి సంబంధించినది. కరుంగలి మాలతో జపం చేయడం వల్ల, మెడలో ఆభరంగా ధరించడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా తగ్గిపోతుందని విశ్వశిస్తారు. జాతకంలో కుజుడి ప్రభావం ఉంటే రక్త సంబంధిత వ్యాధులుంటాయి, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులుంటాయి. వాటిని తొలగిస్తుంది కరుంగలి మాల.
కరుంగలి మాలతో ఎన్నో ప్రయోజనాలు
దిష్టి , దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు ఉన్నాయని విశ్వశించేవారు కరుంగలి మాల ధరిస్తే వాటినుంచి రక్షణ లభిస్తుందట
జపం చేసే అలవాటున్నవారు కరుంగలి మాలను వినియోగిస్తే మానసిన ప్రశాంతత చేకూరుతుంది. ఏకాగ్రత మరింత పెరుగుతుంది
నిత్యం కరుంగలి మాలను నియమాలు పాటిస్తూ ధరిస్తే భూ సంబంధిత వివాదాలు, కోర్టు సంబంధిత వివాదాలు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. ఇంకా విద్య, ఉద్యోగానికి ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయని నమ్మకం
కరుంగలి మాల ఎప్పుడు వేసుకోవాలి? పాటించాల్సిన నియమాలేంటి?
కరుంగలి మాలను మంగళవారం వేసుకోవడం మంచిది. మిగిలిన రోజుల విషయానికొస్తే బుధవారం, గురువారం, శుక్రవారం, శని వారాల్లో పంచమి, ఏకాదశి, పౌర్ణమి కలిసొచ్చినప్పుడు ఈ మాల వేసుకోవచ్చు
సాధారణంగా రుద్రాక్షను ధరించేటప్పుడు ఏ నియమాలు పాటిస్తారో కరుంగలి మాల విషయంలోనూ అవే నియమాలు పాటించాలి.
కరుంగలి మాల ధరించేముందు నీటితో, పాలతో కడగాలి.. దేవుడి దగ్గర పెట్టాలి..పంచామృతాల్లో కాసేపు ఉంచాలి. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి, వారాహి అమ్మవారి దగ్గర ఉంచి పూజించి మాలను ధరించాలి
రుద్రాక్ష ధరించినప్పుడు మద్యం, మాంసం ముట్టుకోకూడదు, మైల సమయంలో వేసుకోకూడదు, రాత్రి నిద్రపోయేటప్పుడు మెడలో ఉండకూడదు, నేరుగా నేలపై ఉంచకూడదు..ఇవే నియమాలు కరుంగలి మాలకు కూడా వర్తిస్తాయి
కరుంగలి మాల కొనుగోలు చేసి 11 రోజులు, 21 రోజులు లేదంటే 108 రోజులు ప్రత్యేక పూజ చేసి ధరించే ఇంకా శుభఫలితాలు వస్తాయని నమ్ముతారు
ప్రస్తుతం అంతా నకిలీ ట్రెండ్ నడుస్తోంది..అందుకే ఆ మాలలు సరైనవో కాదో చూసుకుని, మీరు విశ్వశించే ఆధ్యాత్మిక గురువు సూచనలు తీసుకుని కొనుగోలు చేస్తేనే ఈ ప్రయోజనాలు పొందగలరు































