Chandrababu Naidu: నీ ప్రాబ్లం ఏంటి ఆటిట్యూడ్ తగ్గించుకో .. కలెక్టర్ పై చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu: విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు అడ్డుతగులుతున్న అటవీ శాఖ నిబంధనలు, భూసేకరణలో జాప్యంపై ఆయన అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కనీస సౌకర్యాలైన బోర్‌వెల్స్, విద్యుత్, రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అభ్యంతరాలు తెలపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని ఇంద్రాచల నిబంధనలు ఎందుకని, ఇటువంటి ఇంప్రాక్టికల్ ఆలోచనల వల్లే తీవ్రవాదం వంటి సమస్యలు పుట్టుకొస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఒక అధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “నీ ఆటిట్యూడ్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నా 40 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఆటిట్యూడ్ నేను ఎప్పుడూ చూడలేదు.” అని తీవ్రంగా హెచ్చరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండల ప్రాంతంలో గిరిజనులకు ఇళ్ల నిర్మాణం, మంచినీటి సౌకర్యాలకు అటవీ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై సీఎం సీరియస్ అయ్యారు. “మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడ ఉంచితే అప్పుడు ఆ కష్టాలు ఏంటో తెలుస్తాయి” అని అధికారులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి మొండి వైఖరిని ఎప్పుడూ చూడలేదని, అధికారుల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని హెచ్చరించారు. అటవీ హక్కుల చట్టం (Forest Rights Act) కింద ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని గిరిజనులకు న్యాయం చేయాలని, అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ విషయంలో మైక్రో మేనేజ్‌మెంట్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. గ్రీన్ ఫీల్డ్ హైవేల వెంట ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏర్పాటు కోసం ముందస్తుగా భూమిని గుర్తించాలని ఆదేశించారు. ఒకసారి పనులు ప్రారంభమైన తర్వాత భూమి రేట్లు పెరిగిపోతాయని, అప్పుడు భూసేకరణ అసాధ్యమని పేర్కొన్నారు. ఏలూరు వంటి జిల్లాల్లో అసైన్డ్ భూములను గుర్తించి, నిబంధనల ప్రకారం వాటిని పరిశ్రమలకు కేటాయించేలా చూడాలన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో పని చేయాలని, అధికారుల అలసత్వం వల్ల జిల్లాలు వెనుకబడిపోకూడదని స్పష్టం చేశారు.

అటవీ శాఖ అధికారులు భక్తులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించవద్దని సీఎం ఆదేశించారు. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తుల రాకను నియంత్రించే పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, ఇది తొక్కిసలాటలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల సౌకర్యం ముఖ్యం అని, నిబంధనల పేరుతో అభివృద్ధిని ఆపవద్దని తేల్చి చెప్పారు. అటవీ, రెవెన్యూ శాఖల వివాదాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలని, అవసరమైతే ఉన్నతాధికారులు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. పది నిమిషాల విరామం తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగితే కఠిన చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరిస్తూ సమావేశంలో వేడి పుట్టించారు.