Bhole Baba: ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటి?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలవడం దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో అసలేమిటీ కార్యక్రమం? భారీ సంఖ్యలో మరణాలకు కారణమేంటనే విషయాన్ని పరిశీలిస్తే..


యూపీకి చెందిన నారాయణ్‌ సాకార్‌ హరి.. సాకార్‌ విశ్వ హరి లేదా ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. ఎటా జిల్లా పటియాలి తహసీల్‌లోని బహదూర్‌ గ్రామానికి చెందిన ఆయన.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడట. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేసినట్లు చెప్పుకునేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం నుంచి వైదొలిగి.. ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు.

వేల సంఖ్యలో భక్తులు..
అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్‌ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కాకుండా ఉత్తరాఖండ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ‘భోలే బాబా’కు లక్షల మంది అనుచరులు ఉన్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు.

ఊపిరాడకే..
తాజాగా అక్కడి ఫుల్‌రాయ్‌ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు.