రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పనితో 5 నిమిషాల్లోనే హాయి నిద్ర.

నేటి యాంత్రిక జీవనంలో పగలు పని ఒత్తిడి, రాత్రిపూట నిద్రలేమి చాలా మందిని వేధిస్తున్నాయి. పడుకున్నా గంటల తరబడి మెదడులో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి.


ఈ సమస్యకు ఖరీదైన మందులు అవసరం లేదు, కేవలం ఐదు నిమిషాల ధ్యానం చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం కేవలం ఏకాగ్రతను పెంచడమే కాదు అది మెదడుకు ఇచ్చే ఒక అద్భుతమైన విశ్రాంతి. రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చుని నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల మెదడులోని ఎమోషనల్ సెంటర్ శాంతిస్తుంది. ఇది రోజంతా జరిగిన సంఘటనల నుండి మెదడును రీసెట్ చేసి, గాఢ నిద్రకు సిద్ధం చేస్తుంది.

శరీరంలో జరిగే మార్పులు ఇవే..

రాత్రివేళ ధ్యానం చేయడం వల్ల మన శరీరంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ వంటి హార్మోన్లను తగ్గించి, మెదడుకు ఉపశమనాన్ని ఇస్తుంది. ధ్యానం వల్ల హృదయ స్పందన రేటు రెగ్యులరైజ్ అవడంతో పాటు రక్తపోటు తగ్గుతుంది. మెదడు ఉత్తేజకరమైన తరంగాల నుండి నెమ్మదిగా, ప్రశాంతమైన ఆల్ఫా తరంగాలలోకి ప్రవేశిస్తుంది. ఇది నిద్రకు సరైన స్థితి.

నిద్రలో మధ్యలో మేల్కొనే సమస్యకు చెక్

చాలామందికి నిద్రలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంటుంది. మెదడులోని అమిగ్డాలా అనే భాగం శాంతించడం వల్ల ఇలా ఆకస్మికంగా మేల్కొనే సమస్య తగ్గుతుంది. దీనివల్ల తెల్లవారే వరకు అంతరాయం లేని నిద్ర మీ సొంతమవుతుంది.

ఎలా చేయాలి?

  • రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చోండి.
  • కళ్లు మూసుకుని మీ శ్వాసపై ధ్యాస పెట్టండి.
  • నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ, వదులుతూ ఉండండి.
  • కేవలం 5 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల కండరాలు సడలి, మనస్సు తేలికగా మారుతుంది.

నిపుణుల మాట

పగలు అనుభవించే మానసిక ఆందోళనలు, ఉద్రిక్తతలు నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పడుకునే ముందు చేసే ధ్యానం శారీరక ఉద్రిక్తతను తగ్గించి, హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. ఇది ఓర్పును పెంచడమే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.