రైళ్లల్లో ధూమపానం.. పేలుడు పదార్థాలు తీసుకెళ్లడం నిషేధం. అంతేకాకుండా రైల్వేయాక్ట్ ప్రకారం చాలా తీవ్రమైన నేరం. అయినా కూడా కొందరు చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తూనే ఉంటున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే రైల్లో జరిగింది. ఒక యువతి ఏకంగా ఏసీ కోచ్లోనే సిగరెట్ తాగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. సీట్లో కూర్చుని ధూమపానం చేయడంతో సహచర ప్రయాణికులు హడలెత్తిపోయారు. నిలదీసిన వారిపై రంకెలు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ ప్రాంతం.. ఏ రైల్లో జరిగిందో తెలియదు గానీ ఒక యువతి ఏసీ కోచ్లో సిగరెట్ తాగుతోంది. దీంతో సహచర ప్రయాణికులు అడ్డుకున్నారు. ఇది ఏసీ కోచ్.. రైల్లో ధూమపానం చేయకూడదని తెలియదా? అని నిలదీస్తే.. వారిపై రంకెలు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సెప్టెంబర్ 15, 2025న మంజుల్ ఖట్టర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
వీడియోలో మహిళ సిగరెట్ తాగడాన్ని అడ్డుకున్నారు. ట్రైన్లో సిగరెట్ తాగొద్దని కోరారు. ఒకరు వీడియో తీస్తుండగా తీయొద్దని వాదించింది. ”నువ్వు ఎందుకు నా వీడియో తీస్తున్నావ్.. ఇది చాలా తప్పు.. నా వీడియో తీయొద్దు. డిలీట్ చేయ్..” అని యువతి వాదించింది. ఇక ఈ వీడియోలో సిగరెట్ తాగడం తప్పు అని చెబుతున్నా వ్యాఖ్యలు వినిపించాయి. ఈ రైలు మీది కాదు.. వెళ్లి పోలీసులకు చెప్పుకో అంటూ ఆమె వాదిస్తున్నట్లు కనిపించింది. అయితే వీడియోలో యువతి తీరును చూస్తుంటే.. ఆమె సరిగ్గా మాట్లాడలేకపోతుంది. దీంతో ఆమె మద్యం సేవించి ఉంటుందని భావిస్తున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.




































