చలికాలంలో చల్లటి నీళ్లకు భయపడి చాలా మంది పళ్లు తోముకోవడానికి బద్ధకిస్తారు. ఒక రోజు తోముకోకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటారు. కానీ ఈ చిన్న అలవాటు ప్రాణాపాయానికి కూడా దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు, అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం.. మీరు తిన్న 20 నిమిషాల్లోనే నోటిలోని బ్యాక్టీరియా చక్కెర, స్టార్చ్ను ఆమ్లంగా మారుస్తుంది. ఈ ఆమ్లం దంతాల బయటి పొర అయిన ఎనామిల్ను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.
బ్యాక్టీరియా డబుల్
తిన్న 4-6 గంటల తర్వాత దంతాలపై ప్లేక్ అనే జిగట పొర ఏర్పడటం మొదలవుతుంది. 12 గంటల తర్వాత ఈ ప్లేక్ గట్టిపడి టార్టార్గా మారుతుంది. 24 గంటల తర్వాత చిగుళ్ళు ఉబ్బడం, రక్తస్రావం కావడం, నోటి నుండి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఎయిమ్స్కి చెందిన దంతవైద్యుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఒక రోజు పళ్లు తోముకోకపోతే మీ నోటిలో ఒక మిలియన్ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.
దీర్ఘకాలిక ప్రమాదాలు.. మరణానికి సంకేతం!
పళ్లు తోముకోకుండా ఈ అలవాటును కొనసాగించడం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, చివరికి మరణానికి కూడా దారితీయవచ్చు.
మరణ ప్రమాదం పెరుగుదల: లాన్సెట్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ పళ్లు తోముకోని వ్యక్తులకు మరణ ప్రమాదం 25 శాతం పెరుగుతుంది.
గుండె జబ్బుల ముప్పు: మీరు ఒక సంవత్సరం పాటు పళ్లు తోముకోకపోతే మీ గుండె జబ్బుల ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుంది. నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి ధమనులలో వాపును కలిగిస్తుంది. ఇది గుండె సమస్యలకు దారితీస్తుంది.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు: ఇదే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, న్యుమోనియాకు కూడా కారణమవుతుంది.
నోటి క్యాన్సర్: పొగాకు వాడకపోయినా, పళ్లు తోముకోని వారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దంత క్షయం: ఒక సంవత్సరం పాటు పళ్లు తోముకోకపోతే దంతాలు పూర్తిగా కుళ్ళిపోయి, కుహరాలు, చీము, విపరీతమైన నొప్పికి దారితీస్తాయి. ఇది చిగుళ్ల వ్యాధికి కారణమై, దంతాలు వదులై ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక రోజు పళ్లు తోముకోకపోవడం చిన్న విషయమేమీ కాదు. మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని రక్షించడానికి రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవడం తప్పనిసరి.



































