మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.. వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు

www.mannamweb.com


విజయవాడ ముంపు ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పర్యటించారు. మొన్న సింగ్‌నగర్ వెళ్లిన ఆయన.. తాజాగా రాజరాజేశ్వరిపేటకు వెళ్లారు. వరద బాధితులను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట ఎమ్మెల్సీ బొత్స, మల్లాదివిష్ణు, కారుమూరి, కన్నబాబు ఉన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. వరదలతో.. ఇప్పటికే 32మంది చనిపోయారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ముందస్తు సమాచారం ఉన్నా, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో విఫలం అయ్యారని సీఎం పదవికి చంద్రబాబు అనర్హుడంటూ పేర్కొన్నారు. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ తప్పిదం వల్లే వరదలు వచ్చాయంటూ జగన్ ఆరోపించారు. 6లక్షల మంది బాధితులు ఉన్నారని, ప్రతి ఇంటికి 50వేలతో పాటు.. మృతుల కుటుంబాలకు 25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. వాలంటీర్లు ఉంటే వెంటనే రంగంలోకి దిగేవారని.. ప్రజలకు వెంటనే సహాయం అందించేవారన్నారు జగన్. చంద్రబాబు తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు అధికారులను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు.

వరద బాధితులు తీవ్రఇబ్బందులు పడుతున్నారన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జగన్ వస్తున్నారనే ఆహారం అందిస్తున్నారని.. బాధితులను ఓదార్చే వారే కరువయ్యారన్నారు. అధికారుల నిర్లక్ష్యమని సస్పెండ్‌ చేయడం కాదు.. చంద్రబాబుది తప్పు అయితే శిక్ష వేసుకుంటారా అని ప్రశ్నించారు బొత్స.