Yediyurappa: పోక్సో కేసులో.. యడియూరప్పకు నోటీసులు

Yediyurappa: పోక్సో కేసులో.. యడియూరప్పకు నోటీసులు


బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప(Yediyurappa)కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయనపై నమోదైన పోక్సో కేసు విచారణలో భాగంగా వాటిని ఇచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దిల్లీలో ఉన్న ఆయన.. అక్కడినుంచి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని భాజపా నేత సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందు యడియూరప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు వాటి సారాంశం. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను భాజపా నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఆయనపై ఆరోపణలు చేసిన మహిళ.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఇదిలాఉంటే.. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ ఇదివరకే రికార్డు చేసింది.

కర్ణాటకకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప సీఎం పదవి వీడిన తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గతేడాది నవంబరులో ఆ బాధ్యతలను హైకమాండ్‌ ఆయన కుమారుడు విజయేంద్రకు అప్పగించింది. ప్రస్తుతం యడియూరప్ప భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన అప్పుడే ఖండించారు.